మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 15 : ఈ నెల 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, మెదక్ జిల్లాలో రెండు వారాల్లో 23శాతం నుంచి 40శాతానికి పైగా హాజరు శాతం చేరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాలల్లో సందడి నెలకొంది. పాఠశాలలు ప్రారంభించే వారంరోజుల ముందుగానే ప్రత్యక్ష తరగతులకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించగా, ఆ మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు తీసుకుంది.
పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలను పక్కా గా అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది మాస్క్లు ధరించి వస్తేనే అనుమతి ఇస్తున్నారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. చేతులు కడుక్కోవడానికి సబ్బు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. పాఠశాలలను జిల్లా విద్యాధికారితోపాటు ఆ యా మండలాల విద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం కూడా పెడుతున్నారు.
14,047 కొత్త ప్రవేశాలు
18 నెలల తర్వాత పాఠశాలలు పునఃప్రారం భం కావడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యా లు గతేడాది ఫీజులతో పాటు పెండింగ్ ఫీజుల వసూళ్లపై దృష్టి సారించాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలలో సగానికి తక్కువ మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నూతనంగా ప్రభుత్వ పాఠశాల్లలో 14,047 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 950 ప్రభుత్వ పాఠశాలలుండగా, 89, 604 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
నిబంధనలు పాటిస్తున్నాం..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందు కోసం తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించాలి. ఈ సంవత్సరం కొత్తగా 14,047 ప్రవేశాలు పొందారు.