కోహీర్, సెప్టెంబర్ 14 : ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. దవాఖానలు అవసరమైన ప్రాంతాల్లో నిర్మిస్తూ మెరుగైన చికిత్సలు అందించేందుకు కృషి చేస్తున్నది. దవాఖానల నిర్మాణంతోపాటు అవసరమైన చోట వాటికి మరమ్మతులు చేపడుతూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. మండలంలోని బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుండడంతో పరిసర గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది. దశాబ్ధ కా లం క్రితం ప్రారంభించిన దవాఖాన భవన నిర్మా ణం పలు కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. పదేండ్ల కింద గత సర్పంచ్ శ్రీధర్రెడ్డి హయాంలో పనులను ప్రారంభించారు. రూ.19 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం కొద్దిపాటిగా మిగిలిన పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. దవాఖానలో విధులు నిర్వహించేందుకు వైద్య సిబ్బందిని కూడా గతంలోనే కేటాయించారు. కానీ భవనంలో విద్యుత్ సరఫరా, భవనానికి రంగులు వేయలేకపోవడం, ఫ్లోరింగ్, ఫర్నిచర్ ఏర్పాటు చేయలేదు. దీంతో బిలాల్పూర్ పరిసరా గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించలేకపోయారు.
మంత్రి హరీశ్రావు చొరవ..
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవల గ్రామంలోని రైతు వేదికను ప్రారంభించారు. గ్రామంలో పదేండ్ల కింద నిర్మించిన దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్ నర్సింహులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇం దుకు స్పందించిన మంత్రి హరీశ్రావు భవనానికి అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. అసంపూర్తిగా ఉన్న పనులను రెండు నెలల్లో పూర్తి చేయించాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో మిగిలిన పనులను ఇటీవల ప్రారంభించారు. రంగులు వేయించారు. కిటికీలు, తలుపుల భిగింపు తదితర పనులు చివరి దశకు చేరాయి. త్వరలో భవనం ప్రారంభం కానున్నది. బిలాల్పూర్, మనియార్పల్లి, బడంపేట, గొటిగార్పల్లి తదితర గ్రామాల ప్రజలకు దవాఖానలో వైద్యసేవలందనున్నాయి.
త్వరలో అందుబాటులోకి వస్తుంది..
కోహీర్, దిగ్వాల్ గ్రామానికి వెళ్లి ప్రజలు ప్రస్తుతం చికిత్సలు చేయించుకుంటున్నారు. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బిలాల్పూర్ దవాఖాన త్వరలో ప్రారంభం కానున్నది. దీంతో స్థానికులకు న్యాయం జరుగుతుంది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దవాఖానకు మరమ్మతులు చేయిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.