మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13: విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, విజ్ఞాన ప్రతిభను వెలికితీయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దీని పరిధిలోని విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) సంయుక్తంగా ప్రత్యేక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా 2021-22 సంవత్సరానికి అంతర్జాల విధానంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న పోటీ పరీక్షల నిర్వహణకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఏటా ఈ పోటీలు జాతీయస్థాయి శాస్త్రవేత్త పేరుతో నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆచార్య ప్రపుల్లా చంద్రరాయ్ పేరుపై వీటిని నిర్వహించనున్నారు. ప్రతిభా పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డు నిర్వహించే పాఠశాలలకు చెందిన విద్యార్థులంతా హాజరుకావచ్చు. రూ.100 చెల్లించి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ అనే వెబ్సైట్లో (http://vvm.org.in) అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారికి త్వరలో నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తరువాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5వ తేదీలో విద్యార్థులు అనుకూలమైన రోజును ఎంపిక చేసుకుంటే ఉద యం 11 గంటల నుంచి ఒంటిగంట మధ్య పరీ క్ష ఉంటుంది. ఆంగ్ల, హిందీ భాషలతోపాటుగా తెలుగు భాషలోనూ పాల్గోనే అవకాశమున్నది. ముందుగా పాఠశాల స్థాయిలో తరువాత జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. జిల్లా, రాష్ట్ర స్థాయికి సంబంధించి త్వరలోనే తేదీలను ప్రకటించనున్నారు.
ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు..
సామాన్య, గణితం పాఠ్యపుస్తకాల్లోని అంశాలు 50 శాతం, విజ్ఞాన శాస్త్రంలో భారతదేశ కృషిపై 20 శాతం, ఏదేని శాస్త్రవేత్త జీవిత చరిత్రకు సంబంధించి 20 శాతం, లాజిక్, రీజినింగ్ 10 శాతం ప్రశ్నలు ఉంటాయి. వీటికి సంబంధించిన చదువుకునే పుస్తకాలు ఇదే వెబ్సైట్లో లభ్యం అవుతాయి. ప్రధానంగా బహుళైచ్చిక ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ప్రతిభ చూపిన ముగ్గిరికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, జాతీయస్థాయిలో ప్రతిభ చూపితే రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేల చొప్పున అందజేస్తారు. అలాగే, దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించేలా అవకాశం కల్పిస్తారు.
మంచి అవకాశం..
విద్యార్థి విజ్ఞాన్ మంథన్లో కంప్యూటర్, సెల్ఫోన్ తెలిసిన విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అన్ని పాఠశాలల వారు వెబ్సైట్లో పిల్లల ద్వారా నమోదు చేయించి వారి ప్రతిభను ప్రోత్సహించాలి. త్వరలోనే జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీల పరీక్ష ఉంటుంది. విద్యార్థులు నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.