జిన్నారం, సెప్టెంబర్ 14 : పరిశ్రమలు, పేరున్న సంస్థలు ఆర్థిక వనరులు లేని గ్రామాలను ఎంపిక చేసుకొని సీఎస్ఆర్ నిధులతో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు సమకూరుతున్నాయి. క్రమంగా గ్రామాల అభివృద్ధి ముఖచిత్రం మారుతున్నది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నోవార్టీస్ సంస్థ మండలంలోని సోలక్పల్లి, రాళ్లకత్వ, అండూరు గ్రామ పంచాయతీలను మూడేండ్లపాటు దత్తత తీసుకున్నది. ఆరునెలల నుంచి ఈ మూడు గ్రామ పంచాయతీల్లో చెరువు, కుంటల బాగుకు, నీటి నిల్వకు చెక్డ్యాంలు, టాయిలెట్స్ తదితర వాటిని సమకూర్చాయి. ఇవే కాకుండా స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మొదటి విడుతగా ఐదుగురు మహిళలకు రూ.2.10 లక్షలను సంస్థ అందజేసింది. మూడు గ్రామ పంచాయతీలను మూడేండ్లపాటు దత్తత తీసుకున్న నోవార్టీస్ సంస్థ ఆరునెలల్లో చేసిన అభివృద్ధి పనులను చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం…
కుంట, చెక్డ్యాంల నిర్మాణం
వ్యవసాయ ప్రధానమైన గ్రామాలకు చెరువు, కుంటలు, చెక్డ్యాంలే ముఖ్యమని గుర్తించింది. మొత్తం నాలుగు కుంటలను పూడికతీసి బాగు చేసేందుకు నోవార్టీస్ సంస్థ ఎంపిక చేసుకున్నది. సోలక్పల్లిలో మూడు కుంటలు, రాళ్లకత్వలో ఒక కుంటను గుర్తించింది. ఇందులో మొదటి విడుతగా సోలక్పల్లి పంచాయతీ ఇమామ్నగర్ గ్రామంలోని నర్సారెడ్డి కుంట పూడికతీసి కట్టను వెడల్పుగా చేసింది. అలాగే సోలక్పల్లి, అండూరు గ్రామ పంచాయతీలలో ఎనిమిది చెక్ డ్యాంలను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్న సంస్థ అందులో ఏడింటిని నిర్మించింది. ప్రస్తుతం కాల్వల్లో నిర్మించిన చెక్డ్యాంల వద్ద నీటి నిల్వలు స్థిరంగా ఉన్నాయి. మరో మూడు కుంటలను బాగు చేసేందుకు సిద్ధమవుతున్నది. మరో చెక్డ్యాం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
టాయిలెట్ల నిర్మాణం
రాళ్లకత్వ, అండూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లను కార్పొరేట్ స్థాయిలో బాగు చేసింది. ఏదో మమ అనిపించకుండా పనులు నాణ్యతగా చేపడుతున్నదని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు సోలక్పల్లి, రాళ్లకత్వ, అండూరు గ్రామాలకు వాటర్ ప్యూరిఫై ఏర్పాటు చేసింది. ఇమామ్నగర్, సోలక్పల్లి, అండూరు, రాళ్లకత్వ గ్రామాల్లో హ్యాండ్వాష్లను ఏర్పాటు చేసింది. ఈ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రోత్సాహం
గ్రామంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా నోవార్టీస్ సంస్థ మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్నది. సోలక్పల్లి, ఇమామ్నగర్ గ్రామాలకు చెందిన ఐదుగురు మహిళలకు రూ.2.10 లక్షలు అందజేసింది. వీటితో స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నది. మొదటి విడుత కింద ఐదుగురిని ఎంపిక చేసిన సంస్థ.. మరో రెండున్నరేండ్లలో మరింత మందికి ఆర్థిక ప్రోత్సాహం కల్పించనున్నది. ఈ మూడు గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నోవార్టీస్ సంస్థ ఇంజినీర్లు, నిత్యం గ్రామస్తుల సమస్యలు తెలుసుకుంటున్నారు.
గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న సంస్థకు కృతజ్ఞతలు
నిధులు లేని చిన్న గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకొని గ్రామానికి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్న నోవార్టీస్ సంస్థకు కృతజ్ఞతలు. పెద్ద కార్పొరేట్ సంస్థ మూడేండ్లపాటు సోలక్పల్లి, రాళ్లకత్వ, అండూరు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకోవడం నిజంగా మా గ్రామస్తుల అదృష్టం. దత్తత తీసుకున్న ఆరు నెలల్లోనే చెక్డ్యాంలు, కుంటల పూడికతీత, టాయిలెట్స్, నీటి సదుపాయాలను కల్పించడం అభినందనీయం. గ్రామంలో మరిన్ని సదుపాయాలు కల్పించనుండడం హర్షణీయం.