కొద్ది రోజుల్లో సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు
పాపన్నపేట మండలం సస్యశ్యామలం అవుతుంది
అంబేద్కర్ మహానుభావుడు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
పాపన్నపేట,హవేళీఘనపూర్ మండలాల్లో పర్యటన
అంబేద్కర్ విగ్రహావిష్కరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల అందజేత
పాపన్నపేట,12 ఏప్రిల్ : త్వరలో 25వ ప్యాకేజీ ద్వారా కాళేశ్వరం నుంచి సింగూరుకి నీరు రానుందని దీంతో పాపన్నపేట మండలం సస్యశ్యామలం అవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అర్కెల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అంనతరం పాపన్నపేటలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ తదితర చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేదే చెబుతారని, చెప్పింది కచ్చితంగా చేస్తారని వెల్లడించారు. పాపన్నపేట మండల పరిధిలోని అత్యధిక గ్రామాలకు మండుటెండలో సైతం సాగునీరు అందుతుందని, ముఖ్యంగా ఎల్లాపూర్ మొదలుకొని కొంపల్లి వరకు వివిధ గ్రామాలకు కాళేశ్వరం ద్వారా గోదా వరి జలాలు వస్తున్నాయన్నారు. అంబేద్కర్ గురించి ప్రస్తావిస్తూ అంబేద్కర్ మహానుభావుడని, భారతదేశం దిశ, దశ మార్చిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛాయుత వాతావరణంలో అనుభవించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అంబేద్కర్ పరితపించారని పేర్కొన్నారు. గ్రామస్తులు కష్టపడి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొడదాం అని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రూ. 2కోట్లతో అంబేద్కర్ భవన్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పాపన్నపేట మండల పరిధిలోని 18 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 36 చెక్కులను ఆమె అందజేశారు. ఈ నెల 14వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 333 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిందిగా అర్కెల గ్రామస్తులు కోరగా రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ చందనరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు షర్మిలారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడీల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్, అర్కెల సర్పంచ్ కవిత రవీందర్, ఎంపీటీసీ సభ్యురాలు మౌనిక వివిధ గ్రామాల సర్పంచ్లు గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి శ్రవంతి శ్రీనివాస్ ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ నాయకులు బాలాగౌడ్ దుర్గయ్య బస్వరాజ్ దేవయ్య దేవదానం అనీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుష్కలంగా సాగునీరు..
హవేళీఘనపూర్, ఏప్రిల్ 12 : గతంలో ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీరు లేక ప్రజలు నానా అవస్థలు పడేవారని, కానీ ప్రస్తుతం జిల్లాలోని వాగులు నీటితో పరిగెత్తుతుంటే రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో గోదావరి జలాలు కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా హల్దీవాగు మీదుగా మంజీరాలో పారుతుంటే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. రైతుల అవసరాలను గుర్తించి రాబోయే తరాలకు మరిన్ని ప్రయోజనాలు అందించే పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ రాధా కిషన్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, తహసీల్దార్ సంతోశ్, మండల కోఅప్షన్ సభ్యులు ఖాలేద్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
ఎక్కువ సిక్స్లు కొట్టారు..మ్యాచ్లు ఓడారు!