ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 12 : అన్నదాతలు సాగునీటికి ఇబ్బందులు పడకూడదనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ల నుంచి హల్దీవాగులోకి సాగునీటిని అందించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల రైతుల విన్నపాన్ని గుర్తించి రెండు రోజుల్లోనే హల్దీవాగులోకి సాగునీటిని సీఎం కేసీఆర్ విడుదల చేయడం చరిత్రలో మరువలేని ఘట్టమన్నారు. తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్, యావాపూర్ చెక్డ్యామ్ల నుంచి పొంగిపొర్లుతున్న నీటిని చూసి వారు మురిసిపోయారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, జడ్పీటీసీ రాణీ సత్యనారాయణ, టీఆర్ఎస్ తూప్రాన్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి,ఎంపీపీ స్వప్న, రైతులతో కలిసి జై కేసీఆర్.. జైజై సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సోమవారం హల్దీవాగులో గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ..హల్దీవాగును చూస్తే ముద్దేస్తుందని, గోదావరి జలాలతో నిండుగా పారుతుండడంతో పంటలకు ఢోకా ఉండదన్నారు. మండుటెండల్లో నేడు చెక్డ్యామ్లు గోదావరి జలాలతో మత్తళ్లు దుంకుతున్నాయని, ఇదంతా సీఎం కేసీఆర్ చలవ అని అన్నారు. ఎండకాలంలో సైతం పంట పొలాలకు సాగునీరంది ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందని తెలిపారు. వర్గల్ మండలం వేలూర్ మీదుగా తూప్రాన్ మండలం నాగులపల్లి వరకు సుమారు 16 కిలోమీటర్ల పొడవునా హల్దీవాగు పారుతుందన్నారు. గోదావరి నుంచి 600 మీటర్ల లోతు నుంచి కొండపోచమ్మసాగర్కు, అటు నుంచి 100 మీటర్ల లోతు నుంచి హల్దీవాగులోకి సాగునీరందిస్తున్నారని తెలిపారు. హల్దీవాగులోకి నీటిని అందించి సీఎం కేసీఆర్ తన మాటను నిలబెట్టుకున్నారన్నారు. కోటి ఎకరాల మాగానికి సాగునీటిని అందించి పంటపొలాలను సస్యశామలం చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరిందన్నారు. హల్దీవాగులోని సాగునీటిని అందించడం ద్వారా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, వర్గల్, మర్కూక్, మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్త్తి ,నర్సాపూర్ మండలాలతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. తూప్రాన్ మండలంలోని చెక్డ్యాంలు ఆదివారం నుంచే పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయని, మంగళవారం నాటికి గోదావరి జలాలు వెల్దుర్తి మండలానికి ప్రవేశిస్తాయని వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.
యావాపూర్లో సంబురాలు
తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద హల్దీవాగు గోదావరి జలాలతో పారి చెక్డ్యామ్ం మత్తడి దుంకుతుండడంతో గ్రామస్తులు, రైతులు సోమవారం యావాపూర్లో సంబురాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులు గ్రామశివారులో టెంట్వేసి వంటకాలు నిర్వహించి సంతోషంతో భోజనాలు చేశారు.
చెక్డ్యాంల వద్ద సందడి
హల్దీవాగు నిండుగా పారుతుండడంతో చిన్నారులు, యువకులు,మహిళలు సంతోషంతో జలాల్లో గంతులేశారు. నీళ్లను ఒకరిపై మరొకరూ చల్లుకుంటూ పరవశించిపోయారు.గోదారమ్మ నీటితో వారు ముద్దాడుకున్నారు. చెక్డ్యాం పొంగి ప్రవహిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న తూప్రాన్తో పాటు పరిసరాల్లోని ప్రజలు తిలకించేందుకు భారీ సంఖ్యలో చెక్డ్యాం వద్దకు చేరుకున్నారు.