ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు
ఇద్దరు రైతుల దుర్మరణం, పలువురికి గాయాలు
పిడుగుపాటుకు మృత్యువాత పడ్డ 27 మూగ జీవాలు
అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వాన
వరి ఎండుతున్న తరుణంలో రైతుకు ఊరట
ఉక్కపోతలకు ఉపశమనం
రామాయంపేట/నర్సాపూర్ రూరల్, ఏప్రిల్ 12: సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. సుమారు 27 పాడి పశువులు మృతి చెందాయి.
రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్, చిలిపిచెడ్ మండలాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు పడ్డాయి. రామాయంపేట మండలంలోని డి.ధర్మారం, సుతారిపల్లి, తూప్రాన్ మండలంలోని యావాపూర్, చేగుంట మండల కేంద్రంతో పాటు మక్కరాజుపేట, కర్నాలపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో తేలిక పాటి వర్షం పడింది. ఈదురు గాలులు జోరుగా రావడంతో అక్కడక్కడ చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో విద్యుత్ అధికారులు నాలుగు గంటల పాటు విద్యుత్ను నిలిపివేసి, మరమ్మతులను చేపట్టి అనంతరం అందజేశారు.