115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘనపూర్ ప్రాజెక్టు నేటికి చెక్కుచెదరకుండా ఉంది. నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు సీమాంధ్ర పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. స్వరాష్ట్రంలో పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ‘వనదుర్గా’గా నామకరణం చేయగా, ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఎత్తు పెంపునకు రూ.43.64 కోట్లతో పాటు కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 190 ఎకరాల భూ సేకరణకు రూ.13.1 కోట్లు ఇచ్చింది. ప్రస్తుత వర్షాలకు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. మెదక్, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో ఆయా కాలువల పరిధిలోని చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. యాసంగిలో సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో మంజీర నది పరీవాహక ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు పంటలను పండించుకున్నారు. రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరాయి. ఆయకట్టు కంటే సుమారు 30వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రైతుల పొలాలు కళకళలాడుతున్నాయి.
మెదక్, సెప్టెంబర్ 11 : మెతుకుసీమలో 1896, 1897, 1998 సంవత్సరంలో వరుసగా కరువు ఏర్పడింది. అప్పట్లో పంటలు సాగు చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. మెతుకు సీమలో వ్యవసాయమే జీవనాధారంగా జీవించే రైతులకు తిండిగింజలు కరువై ఆకలి చావులు దాపురించాయి. నీటి కరువుతో పక్షులు, జీవరాసులు అలమటించి మృత్యువుపాలయ్యాయి. మెతుకు సీమలో ఈ పరిస్థితులను చూసిన నిజాం నవాబు చలించిపోయారు. కరువు కాటకాలకు, ఆకలి చావులకు శాశ్వత పరిష్కారం నీరేనని భావించారు. దీంతో మెతుకు సీమ మీదుగా పరవళ్లు తొక్కుతున్న మంజీరా నదిపై ఆనకట్ట నిర్మించాలని నాటి నిజాం నవాబులు సంకల్పించారు.
1899లో ఆనకట్ట నిర్మాణానికి ఆంకురార్పణ..
మంజీరా నది పరీవాహక ప్రాంతంలోని కొల్చారం మం డలం చిన్నఘనపూర్ గ్రామ శివారులో నదిపై ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. దీంతో 1899లో ఆనకట్ట నిర్మాణానికి ఆంకురార్పణ చేశారు. ఆరేండ్ల కాలంలోనే ఘనపూర్ ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు. దీంతో కొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాల పరిధిలోని ఆయకట్టు భూములకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో మహబూబ్నహర్, ఫత్తేనహర్ రెండు కాల్వలను నిర్మించారు. అప్పటి నిజాం నవాబు దృష్టి మెతుకు సీమలోని మంజీరా నదిపై పడింది. దీంతో మంజీరా నదిపై ఘనపూర్ ఆనకట్ట నిర్మించడంతో కొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాల రైతాంగానికి సాగునీటి కష్టాలకు చెక్ పడింది. మూడు మండలాల పరిధిలో ఆయకట్టు కంటే సుమారు 30వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. మహబూబ్నహర్, ఫత్తేనహర్ కాల్వల ద్వారా సాగునీరందడంతో రైతుల పొలాలు కళకళలాడాయి.
తెలంగాణ ఏర్పడ్డాక ఘనపూర్కు పూర్వవైభవం..
నిజాం నవాబులు నిర్మించిన ఘనపూర్ ఆనకట్టపై గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంలో నిర్వహణ కొరవడి ఆనకట్టలో, రెండు కాల్వల్లో పెద్ద మొత్తం పూడిక పేరుకుపోయి, గేట్లు, తూముల షట్టర్లు దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయకట్టు చివరి భూములకు నీరందక వేలాది ఎకరాలు బీడుగా మారాయి. ఆయకట్టు 21వేల ఎకరాలు ఉండగా, 13వేల ఎకరాలకు మించి సాగు అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఘనపూర్ ఆనకట్టకు పూర్తిస్థాయిలో ఆధునీకరించి పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. 2014లో నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, అప్పటి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో వెనక్కివెళ్లిన జైనా నిధులు రూ.25 కోట్లను తిరిగి రప్పించారు. అయితే అప్పట్లో ఈ నిధులతో కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టి చివరి ఆయకట్టుకు నీరందించారు. అదనంగా మరో రూ.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత ఘనపూర్ ఆనకట్ట సాగునీరు వృథాగా పోవడంతో రూ.1.53 కోట్లతో కొత్తగా ఆనకట్ట హెడ్ రెగ్యులేటర్లు, క్రస్ట్గేలు తూముల షట్టర్లును ఏర్పాటు చేశారు.
ఘనపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపుకు రూ.43.64 కోట్లు మంజూరు
115 ఏండ్ల చరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు 2014 డిసెంబర్ 17న ఘనపూర్ ఆనకట్టను సందర్శించి, హెలీకాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసిన సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆనకట్ట ఎత్తు పెం పునకు రూ.43.64 కోట్లు మంజూరు చేశారు. కొల్చారం, పాపన్నపేట మండలాలకు సంబంధించి 190 ఎకరాలు అవసరం కాగా, భూ సేకరణకు రూ.13.1 కోట్లు మంజూరయ్యాయి. పాపన్నపేట మండలంలో 120 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా, రూ.5 కోట్లు రైతులకు అందజేశారు. కొల్చారం మండలానికి సంబంధించి 70 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు లబ్ధి కలుగుతోంది. ఆనకట్ట ఎత్తు పెంపుతో 30వేల ఎకరాలకు సాగునీరు అంది భూములన్నీ సస్యశ్యామలం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఘనపూర్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు మంజూరు చేయడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
కళకళలాడుతున్న చెరువులు..
వానాకాలంలో ఘనపూర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసే మహబూబ్నహర్, ఫతేనహర్ కెనాళ్లు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో మెదక్, పాపన్నపేట, హవేళీఘణాపూర్ మండలాల్లో ఆయా కాల్వల పరిధిలోని చెరువులన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. గత యాసంగిలో సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో చిలిపిచెడ్, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్ మండలాల పరిధిలో మంజీరా నది పరీవాహక ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు పంటలను పండించుకున్నారు.
వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం..
ఘనపూర్ ప్రాజెక్టు పేరును వనదుర్గాభవానీ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ నామకరణం చేశారు. 2020 ఆగస్టు 11న రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ప్రగతిభవన్లో నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 115 ఏండ్ల క్రితం నిర్మించిన ఘనపూర్ ప్రాజెక్టు పేరును వనదుర్గా భవానీ ప్రాజెక్టు పేరును నామకరణం చేసినందుకు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆనకట్ట వివరాలు..
నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీ
కాల్వలు మహబూబ్నహర్, ఫత్తేనహర్
ఆయకట్టు 21,625 ఎకరాలు
ఆయకట్టు కింద మండలాలు కొల్చారం, పాపన్నపేట, మెదక్
పొంగిపొర్లే నీరు 4,10,000 క్యూసెక్కులు
మహబూబ్నహర్ కెనాల్..
పొడువు 42.80 కిలోమీటర్లు
ఆయకట్టు 11,425 ఎకరాలు
ఆయకట్టు కింద గ్రామాలు 18
మండలాల పరిధి కొల్చారం, మెదక్, హవేళీఘణాపూర్
సాగయ్యే పంటలు వరి
ఫతేనహర్ కెనాల్..
ఫతేనహర్ కాల్వ పొడువు 12.89 కిలోమీటర్లు
ఆయకట్టు 10.200 ఎకరాలు
గ్రామాలు 11
మండలాల పరిధి పాపన్నపేట
సాగయ్యే పంటలు వరి