పథకం ప్రకారమే మెదక్ వ్యాపారి శ్రీనివాస్ హత్య
ప్రధాన నిందితుడు అరెస్ట్
పరారీలో ఉన్నఇద్దరిని త్వరలోనే పట్టుకుంటాం
మెదక్ ఎస్పీ చందనదీప్తి వెల్లడి ప్రకారమే శ్రీనివాస్
హత్య, ఆపై సజీవ దహనం పధాన సూత్రదారి అరెస్ట్
ఉన్న మరో ఇద్దరినిత్వరలోనే పట్టుకుంటాం ఎస్పీ చందనదీప్తి వెల్లడి
మెదక్, ఆగస్టు 11 : మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆమె వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్ ఈ నెల 9న ఉదయం ఏడుపాయలలో దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. 10న తిరుపతికి వెళ్తానని విమానం టికెట్లు బుక్ చేశానని భార్య హైందవికి చెప్పాడు. తాను ఇప్పుడు హైదరాబాద్కు వెళ్లివస్తానని మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటల్ వద్ద మెదక్ పట్టణానికి చెందిన శివ, బట్టి నిఖిల్, పవన్ను కారులో ఎక్కించుకున్నాడు. మెదక్ నుంచి చేగుంట మీదుగా రామాయంపేటకు వెళ్లారు. అక్కడి నుంచి జప్తిశివనూర్ రాగానే, ఫోన్ సిగ్నల్స్ పని చేయలేదు. ఆ తర్వాత రాత్రి సమయంలో వెల్దుర్తి మండలం కుకునూర్-నర్సాపూర్ రోడ్డులో హోండాసిటీ కారులో ఉన్న శ్రీనివాస్ను శివతో పాటు నిఖిల్, పవన్ కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య తర్వాత శవాన్ని కారులో సుమారు నాలుగైదు గంటల పాటు శివారు ప్రాంతాల్లో తిప్పారు. అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండటానికి కారు డిక్కీలో వేసి, కారును పెట్రోల్తో తగులబెట్టారు. ఆ సమయంలో ఎవరో ఆటో డ్రైవర్ తన ఫోన్లో కారు తగులబడుతున్న దృశ్యాలను చిత్రీకరించాడు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోండా సిటీ కారు మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్దిగా గుర్తించారు. వెంటనే మెదక్ పట్టణంలోని ధర్మకార్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు భార్య హైందవిని విచారించారు. అనంతరం మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య హైందవి తన భర్తకు కృత్రిమ పళ్లు ఉన్నాయని చెప్పగా, వాటి ఆధారంగా శ్రీనివాస్గా పోలీసులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు భార్య హైందవి తన భర్త హత్యకు అక్రమ సంబంధమే కారణమని ఫిర్యాదులో పేర్కొంది.
సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో విచారణ
సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా హత్యకు సంబంధించిన విచారణను చేపడుతున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిఖిల్, పవన్ను త్వరలో పట్టుకుంటామన్నారు. శ్రీనివాస్ హత్యకు రూ.15లక్షల ఆర్థిక, వ్యాపార లావాదేవీలే కారణమని తెలుస్తున్నదని ఎస్పీ చెప్పారు. ఆర్థిక లావాదేవీలు మాట్లాడుకోవడానికే శ్రీనివాస్ హోండీ సిటీ కారులో శ్రీనివాస్తో పాటు శివ, నిఖిల్, పవన్ వెళ్లారని తెలుస్తోందన్నారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలోనే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని చెప్పారు.
గతంలోనే శివపై రౌడీషీటర్ కేసు
మెదక్ పట్టణానికి చెందిన శివపై గతంలోనే రౌడీషీటర్ కేసు నమోదైందని, ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ తెలిపారు. హత్య చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, ఇంకా ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. 24 గంటల్లో కేసును ఛేదించిన మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్తో పాటు సీఐలు, ఎస్సైలను ఎస్పీ అభినందించారు.