ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
ఇంటింటా సర్వేతో కరోనా కట్టడి
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్, మందుల కొరత లేదు..
15 తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోస్ టీకా
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
మెదక్ పర్యటనలో మంత్రి హరీశ్రావు
ప్రతి ఒక్కరూ కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేయాల్సినంత చేస్తున్నదని, కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో వైరస్ తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడడంతో పాటు కుటుంబసభ్యులు, స్థానికంగా ఇతరులకు వ్యాపింపచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లాలో మంత్రి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మెదక్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటింటా సర్వేతో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దవాఖానల్లో మందులు, టీకా కొరత లేకుండా కృషిచేస్తున్నామన్నారు. ఈ కష్టకాలంలోనూ మెదక్ జిల్లాలో 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రైతులకు వెంటవెంట చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్/మున్సిపాలిటీ/రూరల్, మే 8
మెదక్, మే 8 : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో వైరస్ తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడడంతో పాటు కుటుంబసభ్యులు, స్థానికంగా ఇతరులకు వ్యాపింపచేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా, ధాన్యం కొనుగోలు, మున్సిపాలిటీలో వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో శనివారం మెదక్ కలెక్టరేట్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, కలెక్టర్ హరీశ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇంటింటికీ సర్వే ప్రారంభించారన్నారు. మెదక్ జిల్లాలో 581 బృందాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 1.40 లక్షల ఇండ్లను సర్వే చేశాయన్నారు. 6126 మందిని గుర్తించామని, 4.50 శాతం మాత్రమేనని, ఇందులో 3,491 మందికి కరోనా మందుల కిట్లు, స్వల్ప లక్షణాలున్న మరికొందరికీ ట్యాబెట్లు అందించారని తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్ను గుర్తించడం సాధ్యపడుతుందని, తద్వారా ప్రాణాలు కాపాడిన వారమవుతామని, ఇందులో అధికారులతో పాటు అందరూ ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
ఈనెల 15 తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి ..
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఆక్సిజన్, రెమ్డెసివిర్, ఇతర మందుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్ ఇన్స్పెక్టర్ వీటిని మానిటరింగ్ చేయాలని మంత్రి హరీశ్రావు సూచించారు. ప్రస్తుతం మెదక్ జిల్లాకు రోజుకు 15 రెమ్డెసివిర్ వస్తున్నాయని వాటిని పెంచాలని, అలాగే జిల్లాలో రెండో డోస్ వేసుకునే వారు లక్ష మంది ఉంటారన్నారు. కానీ, 3వేల మందికి సరిపడా టీకా మాత్రమే సరఫరా అవుతున్నదని, టీకా డోస్లు పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులను ఫోన్లో మంత్రి కోరారు. రెండో డోసు తీసుకునే వారు మొదటి డోసు తీసుకున్న కేంద్రానికి ఆధార్ కార్డుతో వెళ్లాలని, వారం రోజుల్లోగా అందరికీ టీకాలు ఇస్తామని మంత్రి చెప్పారు. ఈనెల 15 తర్వాత 45 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోసు టీకా వేస్తామని వెల్లడించారు. గ్రామాల్లో అందరూ స్వీయ నియంత్రణ పాటించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూ పాలని, మాస్క్ ధరించని వారికి రూ.500 జరిమానా విధించాలన్నారు.
మెదక్ జిల్లాలో 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.91 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. రోజు నాలుగైదు ట్రిప్పులు ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సిన లారీలు, మిల్లుల వద్దే అన్లోడ్ కాక ఉండిపోతున్నాయని, లేబర్ కొరత ఉన్నదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా లేబర్ను ఏర్పాటు చేసుకొని మిల్లులకు తరలించి అన్లోడ్ చేయడానికి, వారికి తగు పేమెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రైస్మిల్లుల అధ్యక్షుడు చంద్రపాల్కు మంత్రి సూచించారు. లారీలు తమకు కేటాయించిన పాయింట్కు ధాన్యం తరలించకుండా, ఇతర మార్గాలు అన్వేషిస్తే అలాంటి వాటిని సీజ్ చేయాలని అన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మిల్లుల వద్దే ఉండి ధాన్యం అన్లోడ్ అయ్యేలా చూడాలని, ట్రాక్షీట్ వచ్చిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేసి 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులను జమచేయాలన్నారు. అనంతరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనుల ప్రగతి, తూప్రాన్లో రోడ్డు వెడల్పుకు స్థలాల అప్పగింత తదితర అంశాలపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో మంత్రి హరీశ్రావు చర్చించారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.