తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు
దప్పిక తీర్చేందుకు 350 సాసర్ పిట్లు
మూడు నాలుగు రోజులకు ఒకసారి నీరు నింపేలా ప్రణాళికలు
పోచారం అభయారణ్యంతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో నిర్మాణం
రెండు చోట్ల సోలార్ బోర్లు..
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 3:అధిక ఉష్ణోగ్రతలతో వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఎండలకు భూగర్భ జలాలు అడుగంటుతుండగా, అడవుల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ చర్యలు ముమ్మరం చేసింది. పోచారం అభయారణ్యంతో పాటు రాజ్పేట, పర్వతాపూర్, బూర్గుపల్లి, శెట్టిపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 350కి పైగా సాసర్ పిట్ (నీటితొట్టి)లలో నీటిని అందుబాటులో ఉంచుతున్నది. బోర్ల ద్వారా మూడు నాలుగురోజులకోసారి వీటిల్లో నీటిని నింపుతుండగా, వానకాలం ప్రారంభం వరకు అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు. రెండుచోట్ల విద్యుత్ సరఫరా అందుబాటులో లేకపోవడంతో అక్కడ సోలార్ పవర్ ద్వారా బోర్లను నడిపిస్తున్నారు. సాసర్ పిట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వన్యప్రాణుల కదలికలు, కొత్త జంతువులను గుర్తించడంతో పాటు అవసరాన్ని బట్టి తొట్లలో నీటిని నింపుతున్నారు. అడవిలో కుంటలను గుర్తించి నీటి నిల్వ కోసం సుమారు 30 చిన్న చెక్ డ్యామ్లను సైతం నిర్మించారు. జంతువులు గ్రామాల్లోకి వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, బావులు అడుగంటుతున్నాయి. పశు పక్ష్యాదులు దాహంతో అల్లాడి పోకుండా ముందస్తుగానే అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మెదక్ జిల్లాలో 57 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్నది. ఇందులో 5వేల హెక్టార్లల్లో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో రకాల వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వాటి దప్పిక తీర్చేందుకు అటవీ శాఖధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేసవి ఎండలు తీవ్రమయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వన్యప్రాణులు సంచరించే అటవీ ప్రాంతాల్లో నీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని పోచారం అభయారణ్యంలో నీటి వసతులు ఏర్పాటు చేయడానికి లక్షలు ఖర్చు చేసి సోలార్తో నడిచే బోర్లు ఏర్పాటు చేశారు. నీటి వసతిలేని ప్రాంతాలను రెండు సంవత్సరాల క్రితమే గుర్తించి అధికారులు అక్కడ బోర్లువేసి పైపులైన్ల ద్వారా గుంతల్లో నీరు నింపుతున్నారు. ఇతర అటవీ ప్రాంతాల్లో 350కి పైగా సాసర్ పిట్లలో మూడు నాలుగు రోజులకోసారి నీటిని నింపేందుకు ఫిబ్రవరి మొదటి వారం నుంచే చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు ప్రారంభమయయ్యేంత వరకు నీరు నింపేలా చర్యలు తీసుకుంటూ వన్యప్రాణుల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండు ప్రాంతాల్లో సోలార్ బోర్లు..
మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం అభయారణ్యంలో వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండేండ్ల క్రితమే రెండు ప్రాంతాల్లో సోలార్ ద్వారా నడిచే బోర్లు, పైపు లైన్లను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో బోరు ఏర్పాటు చేస్తే దానికి విద్యుత్ సరఫరా అందుబాటులో లేనందున సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జియాలస్టులు ఎంపిక చేసిన ప్రాంతంలో బోర్లు వేసి వాటికి కొంత దూరం వరకు పైపులైన్లు ఏర్పాటు చేసి గుంతల్లో పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేసి నీరు భూమిలోకి ఇంకకుండా నింపుతున్నారు. వేసవి దృష్టిలో పెట్టుకుని వన్యప్రాణుల ఆహారం కోసం గడ్డిని పెంచడానికి నీటిని పారించే ఏర్పాట్లు చేస్తున్నారు. వన్యప్రాణులకు నీటితో పాటు మేత లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో నీరు నిలిచే కుంటలను గుర్తించి నీటి నిల్వల కోసం సుమారు 30 చిన్న చెక్ డ్యామ్లు సైతం నిర్మించారు.
సాసర్ పిట్లలో నీరు..
వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ప్రతి మూడు నాలుగు రోజులకోసారి సాసర్ పిట్లలో నీటిని నింపేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలైన పోచారం అభయారణ్యంతో పాటు రాజ్పేట, పర్వతాపూర్, బూర్గుపల్లి, శెట్టిపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ల ద్వారా నీటి నింపుతూ జంతువుల దాహాన్ని తీర్చుతున్నారు.
సీసీ కెమెరాల్లో..
నీటి వసతులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జంతువులు దాహం తీర్చుకుంటున్న చిత్రాలను అధికారులు సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించి పరిశీలిస్తున్నారు. రాజ్పేట, పర్వతాపూర్ అటవీ ప్రాంతాల్లో చిరుత పులులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అడవిలో జంతువులు తిరుగుతున్న తీరు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతున్నాయి.
జంతువుల దాహం తీర్చేందుకు ఏర్పాట్లు..
వేసవి దృష్యా అడవి జంతువుల దాహం తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫిబ్రవరి మొదటి వారం నుంచే సాసర్ పిట్లలో ట్యాంకర్ల ద్వారా నీరు నింపుతున్నాం. పోచారం అటవీ ప్రాంతంలో రెండు బోర్లకు సోలార్ ప్లాంట్ విద్యుత్ అమర్చి నీరందిస్తున్నాం. సీసీ కెమెరాలు ద్వారా వన్యప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయా లేదా పరిశీలిస్తున్నాం. ఏవైనా అడవి జంతువులు గ్రామాల్లోకి వస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. టోల్ ఫ్రీ నెంబర్ 18004255264 లేదా 1926 నంబర్కు ఫోన్ చేయాలి.