అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
రూర్బన్ పథకం నిధులు వెనక్కివెళ్లే అవకాశముంది
వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్
మెదక్, ఏప్రిల్ 3 : రూర్బన్ పథకం కింద పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరమైన కార్యక్రమాలు చేపట్టి సమగ్ర అభివృద్ధితో పాటు వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ఎంపిక చేసింది. ఇప్పటి వరకు రూ.30 కోట్లు మంజూరు చేయగా 435 పనులను గుర్తించి రూ.12 కోట్లు ఖర్చు చేసి 256 పనులు పూర్తి చేశామని, 115 పనులు ప్రగతిలో ఉన్నాయని, మరో 64 పనులు మొదలు పెట్టాల్సి ఉందన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిధులను సకాలంలో ఉపయోగించకుంటే వెనక్కి వెళ్లే అవకాశముందని వివరించారు.
ఈ పథకం కింద చేపట్టిన పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, సైన్స్ ల్యాబ్, పశు సంవర్ధక, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, వైద్య ఉప కేంద్ర భవనాలు, వైకుంఠధామాలకు నీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణాలతో పాటు జ్యూట్ బ్యాగుల తయారీ, మీల్స్ ప్లేట్, బేకరీ యూనిట్లు నెలకొల్పడం, మిల్లట్స్ ప్రాసెసింగ్, ప్యాడీ సీడ్ ప్రాసెసింగ్, మిల్క్ చిల్లింగ్ సెంటర్ వంటి యూనిట్లు త్వరితగతిన నెలకొల్పుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు చూడాలని, వారు చేయలేని పక్షంలో అగ్రిమెంట్ రద్దు చేసి ఇతర ఏజెన్సీలకు ఇవ్వాలని సూచించారు. జూన్, జులైలో పాఠశాలలు తెరిచే అవకాశమున్నందున పాఠశాల గదులు, మరుగుదొడ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా మిగిలిపోయిన 13 వైకుంఠధామాలకు వారం లోగా నీటి కనెక్షన్ ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులోగా పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డి, డీఈవో రమేశ్కుమార్, పాపన్నపేట మండల ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.