153పనుల రికార్డులు మాయం
మధ్యలోనే వెళ్లిపోయిన తనిఖీ అధికారులు
లింగాల, ఏప్రిల్ 3: స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సర్పంచ్ కోనేటి తిరుపతయ్య అధ్యక్షతన నిర్వహించిన ఉపాధిహామీ పథకం గ్రామసభ గందరగోళంగా కొనసాగింది. అక్టోబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2021వరకు లింగాల పంచాయతీ పరిధిలో నిర్వహించిన పనుల గురించి వారం రోజులపాటు తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో తిరిగి సేకరించిన నివేదికలను కూలీల ఎదుట చదివి వినిపించారు. పంచాయతీ పరిధిలో సేకరిస్తున్నారు. లింగాల పంచాయతీ పరిధిలో 230 పనులకుగానూ రూ.2.24కోట్లు మంజూరు కాగా 2,222 మంది కూలీలకు జాబ్కార్డు కల్గి ఉన్నట్లు తనిఖీ అధికారులు వెల్లడించారు. అందులో 153 పనులకు సంబంధించిన రికార్డులను ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీలో వాస్తవంగా ఉన్న జాబ్కార్డుల కంటు నిబంధనలకు విరుద్ధ్దంగా అధికంగా తయారు చేసినట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి.
క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కేవలం 557మంది వరకు మాత్రమే జాబ్కార్డులు చూపించారని, మిగతా కూలీలకు అడుగగా తమ దగ్గర జాబ్కార్డులు లేవని కూలీలు తెలిపినట్లు తనిఖీ అధికారులు గ్రామసభలో వెల్లడించారు. కాగా పంచాయతీలో ఉపాధి పనులలో దాదాపు రూ.కోటికిపైగా నిధులు పక్కదారి పట్టినట్లు కొంతమంది లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తనిఖీ బృందాలు తెలుపగా గందరగోళం నెలకొంది. ఫిర్యాదులను గ్రామసభలో వెల్లడించాలని సర్పంచ్ తిరుపతయ్య డియాండ్ చేశారు. దీంతో సర్పంచ్ చేసిన డిమాండ్ను తనిఖీ బృందాలు తిరస్కరించాయి. ఈనెల 7న మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించే ప్రజావేదికలో పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన నివేదికలను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, ఎస్ఆర్పీలు బాలనారాయణ, అనిల్కుమార్, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.