3 ప్రత్యేక రైళ్లను ప్రారంభించిన ప్రభుత్వం
పగటి పూట ప్రయాణానికి అవకాశం
లోకల్ ట్రైన్లు ప్రారంభించాలని ప్రయాణికుల వేడుకోలు
మహబూబ్నగర్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ దృష్ట్యా నిలిచిన రైల్వే ప్రయాణాలు ఎట్టకేలకు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి జిల్లా మీదుగా కర్నూల్ వైపు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా ఇవి దూర ప్రయాణాలకు సంబంధించినవి కావడంతో వీటి ఉపయోగం తక్కువే. ఈనెలలో ప్రవేశపెట్టిన మరో మూడు ప్రత్యేక రైళ్లతో స్థానిక ప్రయాణికులకు కాస్త వెసులుబాటు లభించింది. మహబూబ్నగర్, గద్వాల, కర్నూల్, జడ్చర్ల, షాద్నగర్, కాచిగూడ వంటి సమీప ప్రాంతాలకు ప్రయాణించాలన్నా కొవిడ్ నిబంధనల మేరకు రిజర్వేషన్ తప్పనిసరి చేయడంతో ఇబ్బందిగా మారింది.
కొవిడ్ కారణంగా రైలు ప్రయాణాలే కష్టంగా మారాయి. కరో నా ఉధృతి తగ్గిన తరువాత గతేడాది చివరి నుంచి ఉమ్మడి జిల్లా మీదుగా కర్నూల్ వైపు నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ దూర ప్రయాణాలకు సంబంధించినవే కావడం, వీటికి డిమాండ్ అధికంగా ఉండడంతో స్థానికు లు సద్వినియోగం చేసుకునే అవకాశం కనిపించలేదు. అయితే ఈ నెల నుంచి మళ్లీ మూడు ప్ర త్యేక రైళ్లు ప్రారంభించడంతో స్థానిక ప్రయాణాల కు వెసులుబాటు లభించింది. అయితే, మహబూబ్నగర్ నుంచి గద్వాల, కర్నూల్, జడ్చర్ల, షాద్నగర్, కాచిగూడ వంటి సమీప ప్రాంతాలకు వెళ్లాలన్నా కొవిడ్ నిబంధనల మేరకు రిజర్వేషన్ త ప్పనిసరి చేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పని కోసం నిత్యం ఇతర ప్రాంతాలకు వె ళ్లేందుకు తక్కువ రవాణా ఖర్చులతో రైళ్ల లో ప్రయాణించేవారు. బస్సుల్లో వెళ్లాలంటే చార్జీలు భారంగా మారడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. తాజాగా సికింద్రాబాద్-కర్నూల్ ఎక్స్ప్రెస్, కాచిగూడ-గుంటూరు ఫాస్ట్ ప్యాసెంజర్ రైళ్ల ను ఈ నెల 1 నుం చి ప్రారంభించడంతో కాస్త వెసులుబాటు లభించినైట్లెంది.
కాచిగూడ-డోన్ సెక్షన్లో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల వంటి ప్రధాన రైల్వే స్టే షన్లున్నాయి. ఈ మార్గంలో కర్నూల్, చెన్నై, తిరుపతి, బెంగళూరు, మైసూరు, మంగళూరు, రామేశ్వరం, సికింద్రాబాద్, ఢిల్లీ, జైపూర్, ఓకా, లక్నో తదితర ప్రాంతాలకు రైళ్లు నడిచేవి. వీటితో పాటు కాచిగూడ నుంచి మహబూబ్నగర్, రాయిచూరు, కర్నూల్, గుంతకల్, గుంటూరు తదితర ప్రాంతాలకు లోకల్ రైళ్లు వెళ్లేవి. కానీ కొవిడ్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిపేశారు. అయితే, గత ఏడాది చివర్లో దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లను కొవిడ్ ప్రత్యేక రైళ్ల పేరిట మార్చి.. కేవలం రిజర్వేషన్తో మాత్రమే ప్రయాణించేలా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ రైళ్లతో సాధారణ రైల్వే ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. చిన్న చిన్న పనులు చేసుకునే వారు రిజర్వేషన్లు చేసుకొని ప్రయాణించాలంటే వీలు కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే ప్రయాణాలు భారీగా తగ్గాయి.
స్థానిక రైళ్లు ప్రారంభం..
గతంలో సికింద్రాబాద్-కర్నూల్-సికింద్రాబా ద్ మధ్య నడిచిన తుంగభద్ర, హంద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు ఏప్రిల్ 1 నుంచి కొవిడ్ ప్రత్యేక రైళ్లుగా ప్రా రంభమయ్యాయి. ఇక గతంలో కాచిగూడ-గుంటూరు-కాచిగూడ మధ్య ప్రయాణించిన ఫాస్ట్ ప్యాసెంజర్ రైలును సైతం ప్రత్యేక రైలుగా ప్రారంభించారు. అయితే వీటికి తప్పనిసరిగా రిజర్వేషన్ చేయించుకోవాలి. సాధారణంగా రిజర్వేషన్ ప్రక్రి య ఎలా ఉంటుందో ఈ రైళ్లకు కూడా అదే వర్తిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. రిజర్వేషన్ లేకుండా రైలు ఎక్కే పరిస్థితే లేదని చెబుతున్నారు. అన్ని బోగీలనూ రిజర్వేషన్లుగా మార్చేశారు. ప్ర యాణికులు కోరుకున్నట్లు బెర్తులుగానీ, సీట్లు గానీ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది.
లోకల్ రైళ్లలో తక్కువ చార్జీలు..
కర్నూల్ నుంచి మొదలుపెడితే గద్వాల, శ్రీ రాంనగర్, వనపర్తి రోడ్డు, దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ వంటి అనేక స్టేషన్ల నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్లో వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి కోసం అనేక మంది లోకల్ రైళ్లలో తిరిగేవారు. చార్జీలు తక్కువ కావడంతో నెలవారీ పాసులు తీసుకుని కూడా ప్ర యాణించేవారు. ప్రస్తుతం లోకల్ రైళ్లు లేక వేలాది మందికి ఉపాధి అవకాశాలు గండిపడ్డాయి. సీజన్ టిక్కెట్ (మంత్లీ పాస్) ద్వారా కేవలం నెలకు రూ.500 ఖర్చు చేసి మహబూబ్నగర్-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వీలుండేది. బస్సుల్లో వెళ్లాలంటే రూ.6 వేల నుంచి రూ.7 వేలు ఖర్చవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్లు వాటిని వదిలేసి స్థానికంగానే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటున్నారు.
తగ్గిన ప్రయాణాలు..
లోకల్ రైళ్లు లేకపోవడం, రిజర్వేషన్లు తప్పనిసరి కావడంతో గతంలో జరిగే ప్రయాణాలతో పోలిస్తే కేవలం 10 శాతం మాత్రమే వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ప్రయాణాలు పెరగాలంటే రిజర్వేషన్లు తీసేయడంతోపాటు లోకల్ రైళ్ల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
ఇవికూడా చదవండి..
బంగ్లాదేశ్లో ఏడు రోజుల పాటు లాక్డౌన్
ఆన్లైన్ విమర్శకుల్ని అరెస్టు చేస్తున్న సైన్యం
కారుతో ఢీకొట్టి.. కత్తితో పొడిచి.. అమెరికాలో పోలీస్ మృతి