కనిష్ఠంగా రూ.5 గరిష్ఠంగా రూ.35 వరకు పెంపు
వాహనదారులకు పెరగనున్న భారంమహబూబ్నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాహనదారులకు అదనపు భారం పడనున్నది. జాతీయ రహదారులపై ప్రయాణించే వారి జేబులు ఖాళీ కానున్నాయి. అలంపూర్ టోల్ ప్లాజా వద్ద టోల్ చార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో వాహనానికి కనిష్ఠంగా రూ. 5 నుంచి గరిష్ఠంగా రూ.35వరకు పెంచారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త టోల్ చార్జీలు అమల్లోకి వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి31 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి.
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి అదనపు భారం పడనున్నది అలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఛార్జీలు పెంచుతూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకున్నది. ఒక్కో వాహనానికి ఇరువైపులా కలిపి కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.35 వరకు, నెలవారి పాస్కు రూ.90 నుంచి రూ.775 వరకు, లోకల్ పాస్కు రూ.5 నుంచి రూ. 15 వరకు పెంచారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదించడంతో అలంపూర్ టోల్ ప్లాజాలో బుధవారం అర్ధరాత్రి నుంచే కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ధరలే ఉండనున్నాయి. కారు, జీపు నెలవారీ పాస్ రూ.3,685 ఉండగా.. ఇప్పుడు రూ.3,805కు పెంచారు. ఎన్హెచ్ 44పై 74 కి.మీ. పరిధిలో ఉన్న ఈ టోల్ ప్లాజాలోనే అన్నింటి కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర బ్రిడ్జిల మధ్య ఉన్నందునే హైవే నిర్మాణ సమయంలో పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ టోల్ ప్లాజా వద్ద ఎక్కడా లేని విధంగా అధికంగా టోల్ ఉంటుందని అధికారులు తెలిపారు. పెరిగిన ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఏటా ఛార్జీలు పెంచుతున్నారని వాహనదారులు వాపోతున్నారు.