ఒమిక్రాన్ వ్యాప్తి చాప కింద నీరులా ఉండడంతో థర్డ్వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోవైపు కొవిడ్ కట్టడికి అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. ఇప్పటికే వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండగా, తాజాగా ఎక్కడికక్కడే వైరస్ ఆట కట్టించేందుకు ఫీవర్ సర్వేను ప్రారంభించింది. కొవిడ్ లక్షణాలున్న వారు ఆస్పత్రి వరకూ వెళ్లే అవసరం లేకుండా ప్రజల చెంతకే వైద్యాన్ని చేరువ చేసింది. సెకండ్ వేవ్లో సాధించిన ఫలితాల స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం సైతం శుక్రవారం క్షేత్రస్థాయికి వెళ్లింది. ఆశ వర్కర్లు, మున్సిపల్/గ్రామపంచాయతీ, అంగన్వాడీ సిబ్బంది కలిసి గడప గడపనూ తట్టి ఇంట్లో వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 17 మండలాలు, 6 మున్సిపాలిటీల పరిధిలో 2,10,329 ఇండ్లు ఉండగా.. తొలిరోజు 757 సర్వే బృందాలు 23,536 ఇండ్లల్లో సర్వే చేశాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న 1,254మందిని గుర్తించి 1,254హోం ఐసొలేషన్ కిట్లను అందించాయి. కలెక్టర్ పమేలా సత్పతి యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్పేట్లో ఆకస్మికంగా పర్యటించి జ్వర సర్వే తీరును పరిశీలించారు.
కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. గత రెండు విడుతల్లో చేపట్టిన సర్వేతో వచ్చిన సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మూడో వేవ్ సందర్భంగా మరోసారి జ్వర సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జ్వర సర్వే ప్రారంభమైంది. ఇంటింటి సర్వే ద్వారా ఎక్కడికక్కడ రోగులను గుర్తించి.. మందులు ఇచ్చి కట్టడి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,10,329 ఇండ్లు ఉండగా.. తొలిరోజు ఆదివారం 757 సర్వే బృందాలు సర్వే నిర్వహించాయి. జ్వరం, దగ్గు, జలుబు ఇతర లక్షణాలతోబాధపడుతున్న వారిని గుర్తించి ఇంటివద్దనే హెల్త్ కిట్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్పేట్లో ఆకస్మికంగా పర్యటించి జ్వర సర్వే తీరును పరిశీలించారు.
అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలిజ్వర సర్వేను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 21 : ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. రెండు డోసులు పూర్తయిన అర్హులంతా బూస్టర్ డోసు తీసుకోవాలని ఆమె సూచించారు. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే శుక్రవారం ఆమె యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్పేట గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే వెంటనే గ్రామంలోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలకు సూచించారు. కరోనా కిట్లు తీసుకుని క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు.
సత్ఫలితాలు ఇవ్వనున్న తాజా సర్వే…
జిల్లాలో మొదటి, రెండు విడుతల్లో చేపట్టిన జ్వర సర్వేతోనే సత్ఫలితాలు రాగా.. మూడో విడుత సర్వేతో మరింత సత్ఫలితం వస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తున్నది. ఓ పక్క కరోనా నియంత్రణలో భాగంగా.. మాస్క్ ధరించని వారిపట్ల కఠినతరంగా వ్యవహరించి జరిమానాలను సైతం విధిస్తున్నారు. ఇదే సందర్భంలో జ్వర సర్వే నిర్వహిస్తూ వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సత్వర చికిత్సకు చర్యలు చేపడుతుండడంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య నియంత్రణలో ఉండనుంది. తాజా సర్వేలో జ్వర లక్షణాలున్నవారిని గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని సర్వే బృందాలు తెలుసుకుంటున్నాయి. అలాగే కొత్తగా ఎవరికైనా కరోనా లక్షణాలు కన్పిస్తే వారికి హెల్త్ కిట్లను ఇంటి వద్దనే అందజేస్తున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నవారి రిపోర్టులు వచ్చేలోగానే వారి పరిస్థితి సీరియస్గా ఉంటుండడంతో అటువంటి వారు ఫలితం కోసం ఎదురు చూడకుండా సత్వరమే వైద్యం మొదలుపెట్టేలా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు వారికి కూడా హెల్త్ కిట్లను అందజేస్తున్నారు. జిల్లాలో 22 పీహెచ్సీలతోపాటు, కొన్ని సబ్ సెంటర్లలో ఓపీ సేవలు కొనసాగుతుండగా.. కొవిడ్ లక్షణాలు కన్పించిన వారికి మందులను అందిస్తున్నారు. భువనగిరి ఏరియా దవాఖానతోపాటు చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేట సీహెచ్సీలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో అవసరమైన బెడ్లతోపాటు ఆక్సిజన్ బెడ్లను సైతం అందుబాటులో ఉంచారు. హోం ఐసొలేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలిరోజు సర్వే ఇలా…
ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన బృందాలు వార్డుల వారీగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల పరిధిలో 1,66,876 ఇండ్లు ఉండగా 625 బృందాలు, 6 మున్సిపాలిటీల పరిధిలోని 104 వార్డు పరిధిలో 43,453 ఇండ్లు ఉండగా 132 బృందాలు సర్వే కొనసాగిస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి ఒక సర్వే బృందాన్ని ఏర్పాటు చేయగా… ఇంటింటికీ తిరిగి జ్వరం, దగ్గు, జలుబు, వంటి నొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించాయి. గ్రామ పంచాయతీల పరిధిలో జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారికి, కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి హెల్త్ కిట్లను అందించాయి. అలాగే మున్సిపాలిటీల పరిధిలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వారికి మందులు, కరోనా అనుమానితులకు కిట్లను అందజేశారు. కిట్లను అందజేసిన వారి ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై మానిటరింగ్ సైతం చేయనున్నారు. కరోనాపై సరైన అవగాహన లేక ప్రజలు వైరస్ ముదిరేదాక గుర్తించలేకపోతున్నారు. ప్రాథమిక లక్షణాలు ఉన్నప్పుడే గుర్తించి ముందుగానే చికిత్స అందిస్తే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మూడో విడత జ్వర సర్వేను మరింత పటిష్టంగా నిర్వహించి వైరస్కు కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ దిశగా శుక్రవారం ప్రారంభమైన జ్వర సర్వేలో ఇంటింటికీ వెళ్లిన బృందాలు ప్రతి ఒక్కరినీ పలుకరించాయి. ఏ లక్షణం కనిపించినా.. మెడికల్ కిట్లను అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నాయి. నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నవారు సైతం ఫలితాల కోసం వేచి చూడకుండా వైద్యాన్ని మొదలుపెట్టాలని సూచిస్తూ వైద్య సిబ్బంది హెల్త్ కిట్లను అందిస్తూ ఆరోగ్యం విషయంలో భరోసా కల్పిస్తున్నారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారులను సమన్వయ అధికారులుగా నియమించగా.. వెయ్యి మందికి ఒక సర్వే బృందాన్ని ఏర్పాటు చేశారు. సర్వేను నాలుగైదు రోజుల్లో పూర్తిచేసేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.