ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 12: గిరిజన గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీపై ఎంపీ సోయం బాపురావు ఆరోపణలు చేయడం సరికాదని పార్టీ మండల కన్వీనర్ కొడప సోనేరావ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న తుడుందెబ్బను ఎంపీ సోయం బాపురావు బీజేపీకి అనుకూలంగా ఉన్న సంఘంగా మార్చే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఆదివాసుల ఉద్యమ సమయంలో 9 తెగల వారు తుడుందెబ్బను బలోపేతం చేశారని గుర్తు చేశారు. త్వరలో జడ్పీటీసీ ఉపఎన్నికలు ఉన్నందున ఎంపీ ఇష్టమున్నట్లు మాట్లాడుతూ ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. గిరిజనుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీటీసీ జంగు పటేల్ మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు ఎంపీ తనను గెలిపిస్తే పార్లమెంట్లో ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగిస్తామన్నారు కాని దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మరోసారి ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మెస్రం పరమేశ్వర్, ఎంపీటీసీలు జంగుబాపు, కిషన్, ఆత్రం యాదవ్రావ్, సిడాం లక్ష్మణ్, మడావి అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు.
ఓటమికి భయపడి టీఆర్ఎస్పై ఆరోపణలు..
జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి ఆక్షేపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని చెప్పడం ఎంపీ సోయం బాపురావు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పాయల్శంకర్ మాటలు పట్టించుకునే పరిస్థితిలో మండల ప్రజలు లేరన్నారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, నాయకులు రాజు, తిరుపతి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
916 కేడీఎం గోల్డ్ దోశ.. రేటెంతో తెలుసా?
దరఖాస్తు చేసిన 2 గంటలలోపే ఎల్ఓసీ..