కేటీదొడ్డి, సెప్టెంబర్ 22 : అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. ఏసీబీ డీ ఎస్పీ కృష్ణగౌడ్ కథనం మేరకు.. గద్వాలకు చెందిన తెలుగు రామన్న 20 ఏండ్ల కిందట కేటీదొడ్డి మండలం ఈర్లబండ గ్రామ శివారులో 7 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. తర్వాత ఆ భూమిని పక్క పొలం రైతులు ఆక్రమించారని తెలుసుకొని సర్వే చేయాల ని గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయలేదు. ఈ విషయాన్ని 2020 డిసెంబర్ 7వ తేదీన జిల్లా కలెక్టర్ శృతి ఓఝా దృష్టికి సంబంధిత రైతు తీసుకెళ్లగా.. సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఈ ఏడాది జనవరి 9వ తేదీన భూమిని సర్వే చేశారు. కానీ నేటికీ భూమికి హద్దులు చూపించలేదు.. సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. దీంతో రైతు సర్వేయర్ తిక్కన్నను సంప్రదించగా.. హద్దులు చూపించాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనంతరం ఏసీబీ అధికారులను రైతు ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. రెండు విడుతలుగా డబ్బులు ఇస్తానని సర్వేయర్కు చెప్పాడు. ఈ క్రమంలో బుధవారం గద్వాల పట్టణంలోని రూ.10 వేలు సర్వేయర్ తిక్కన్నకు రైతు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం కేటీదొడ్డి తాసిల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం ఇవ్వాలని వే దిస్తే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ లింగుస్వామి, నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.