మహబూబ్నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆర్అండ్బీ, జాతీయ రహదారులశాఖ అధికారుల వ్యవహారశైలిపై కలెక్టర్ ఎస్.వెంకట్రావు సీరియస్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించి సమీక్షించారు. రెండురోజుల కిందట కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతోపాటు రాయిచూర్-హైదరాబాద్ ప్రధానరహదారి ధ్వంసమైంది. అంతేకాక జిల్లాలోని చాలాచోట్ల ఆర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నాయి. అయితే పరిస్థితిని పర్యవేక్షించాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా ఆయా శాఖల అధికారులు హాజరుకాలేదు. దీంతో రెండు శాఖల ఈఈ, డీఈలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. దెబ్బతిన్న రహదారుల మరమ్మతు విషయంపై చర్చించేందుకు కూడా ఆయా శాఖల అధికారులు అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ మండిపడ్డారు. జాతీయరహదారి ధ్వంసమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం దారుణమని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ ఇన్ ఛీప్కు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపునీరు సాఫీగా దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. ఎర్రగుంట, రామయ్యబౌలి, బీకే.రెడ్డికాలనీ, శివశక్తినగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. అబ్దుల్ఖాదర్ దర్గా, మేనకాథియేటర్ తదితర ప్రాంతాల్లో పూడుకుపోయిన కల్వర్టులను తక్షణమే పునరుద్ధరించాలని జాతీయరహదారుల ఇంజినీర్లను ఆదేశించారు. అలాగే మురుగుకాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. లోత ట్టు ప్రాంతాలకు ఇంకా వరద వస్తున్నందున ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. జాతీయరహదారి విస్తరణ సందర్భంగా అబ్దుల్ఖాదర్ దర్గా, మేనకాథియేటర్ సమీపంలోని మూడు కల్వర్టులను మూసివేశారని, వాటిని తక్షణమే పునరుద్ధరించి వాననీరు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో గణేశ్నగర్, వల్లభ్నగర్, గోల్మసీదు, పాత పాలమూరు తదితర ప్రాంతాల్లో నీ రు నిలువకుండా నేరుగా ఎర్రగుంట నుంచి ఇమామ్సాబ్కుంటకు వెళ్లేందుకు సులభంగా ఉంటుందని అధికారులను సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఇంజినీర్ సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు ఉన్నారు.