గద్వాలటౌన్, సెప్టెంబర్ 29: శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులుగా జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయంలో గోదాదేవిగా, ముడుపుల ఆంజనేయస్వామి ఆలయంలో గిరిజాదేవిగా, కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైష్ణవీదేవిగా, మార్కండేయస్వామి ఆలయంలో ముకాంబికదేవిగా, ఆయా మండపాల్లో అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారు భక్తులకు నుంచి అఖండ పూజలు అందుకున్నారు. ఆయా ఆలయాల్లో నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో కొలిచారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోటలోని భూలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలంయలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారిని నిత్య పూజలతోపాటు విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లాకేంద్రంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో, అశోక్నగర్లో, గంటవీధిలో, బాలాజీవిధిలో, న్యూ హౌసింగ్బోర్డు కాలనీల్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆయా మండపాల్లో అమ్మవారిని వివిధ రూపాలలో అలకరించి పూజించారు.
గట్టు, సెప్టెంబర్ 29: మండలకేంద్రంలోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు గురువారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అలంపూర్, సెప్టెంబర్ 29: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాలుగో రోజు సాయం త్రం అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో గద్వాల సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కవిత, అలంపూరు సివిల్ కోర్టు జడ్జి కమలాపురం కవిత, ఏపీ స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధ్దార్థరెడ్డి దర్శించుకున్నారు. వారితోపాటు ఆలయ ఈవో, చైర్మన్ ఉన్నారు.
ధరూరు, సెప్టెంబర్ 29: దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలకేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో టీఆర్ఎస్ నాయకుడు మంజులాశ్రీధర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ శ్రీహర్ష, నాయకులు రాములు, సంజీవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మల్దకల్, సెప్టెంబర్ 29: ఆదిశిలా క్షేత్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాతా గురువారం అన్నపూర్ణాదేవి ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అయిజ, సెప్టెంబర్ 29: పట్టణంలోని కాళికాదేవీ, అంబాభవానీ, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో కాళికాదేవి, అంబాభవానీ, మీనాక్షి దేవి అలంకరణలో వాసవీ కన్యకాపరమేశ్వరి మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో కుంకుమార్చన, పవమాన హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి, సెప్టెంబర్ 29: శాంతినగర్లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు గురువారం రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు సురేశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇటిక్యాల, సెప్టెంబర్ 29: బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం అమ్మవారిని సంతానలక్ష్మి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు భువనచంద్ర అమ్మవారికి అలంకరణ, కుంకుమార్చన, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులతో పూజలందుకొన్నారు.
రాజోళి, సెప్టెంబర్ 29: రాజోళిలోని అంబాభవానీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజల్లో మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.