మహబూబ్నగర్/టౌన్, సెప్టెంబర్ 29 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పట్టణాలు, గ్రామాలు తడిసిముద్దయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి, భగీరథకాలనీ, వీరన్నపేట, బాలాజీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. పలువురి ఇండ్లలోకి నీరు చేరింది. అసిస్టెంట్ ఇంజినీరింగ్ టౌన్-3 కార్యాలయంలో చెట్టుపై పిడుగు పడింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు. రామయ్యబౌళిలో ఇండ్ల ఎదుట నిలిపిన కార్లు కొట్టుకుపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రత్యేక క్రేన్లను అధికారులు అందుబాటులో ఉంచారు. శ్రీకృష్ణ థియేటర్లోకి వర్షపు నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవర్ పర్యవేక్షించారు. మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు పలు వార్డుల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలో నిలిచిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరాలయంలో మూడు రోజులుగా ముసురు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున ఆలయ ఆవరణలో కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంగళవారం కూడా వాటర్ ట్యాంక్ పక్కన పెద్ద రాళ్లు పడ్డాయన్నారు. కొండపై నుంచి పారుతున్న జలపాతం చూపరులను ఆకట్టుకుంటున్నది.