సమయ పాలనపాటించని ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నది. త్వరలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికే షన్(ఆర్ఎఫ్ఐడీ) గుర్తింపు కార్డులను జారీ చేయనున్నది. కరోనా అనం తరం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయి. దాదాపుగా 2 వేలకుపైగా అదనంగా చేరారు. పాలమూరు జిల్లాలో 876 పాఠశాలలు ఉండగా. 70 వేలకుపైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ల పనితీరు మెరుగుపర్చడంతోపాటు వారిలో అలసత్వాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 22 : సమయపాలన పాటించకపోవడం, విధులకు డుమ్మా కొట్టడం, ఆలస్యంగా వచ్చి హాజరువేసుకోవడం, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న చోట వంతుల వారీగా హాజరయ్యే పద్ధతి.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకుగానూ విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ ఐడీ) గుర్తింపు కార్డులను త్వరలో జారీ చేయనున్నది. మహబూబ్నగర్ జిల్లాలోని 16 మండలాల్లో 876 పాఠశాలలు ఉండగా, 70 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యమైన విద్య, ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడంతోపాటు అలసత్వాన్ని కట్టడి చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఉపాధ్యాయులకు ప్రత్యేక చిప్తో కూడిన గుర్తింపు కార్డుల జారీకి విద్యాశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. కరోనా అనంతరం సర్కార్ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల హాజరు శాతాన్ని కొనసాగించేలా కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా నాణ్యమైన అందించాలని భావిస్తున్నది. అయితే, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపర్చడంతో సహా బడికి ఎగనామం పెట్టి.. మరుసటి రోజు వచ్చి హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసుకునే విధానానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. టీచర్ ఫొటో, పూర్తిపేరు, పుట్టిన ప్రాంతం, ప్రస్తుత నివాసం, పుట్టిన తేదీ, సెల్, ఆధార్, పాన్కార్డు నంబర్లు, గతంలో ఎక్కడ పనిచేశారు..? ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు..? జీతభత్యాలు, హోదాతో సహా సమస్త సమాచారం నిక్షిప్తమై ఉండేలా ఎలక్ట్రానిక్ చిప్తో కూడిన ఐడీ కార్డును ప్రత్యేకంగా రూపొందిస్తున్నది. రెండేండ్ల కిందట ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడడంతో ప్రతిపాదన వెనక్కిపోయింది. పదోన్నతులు, బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్ సమయంలో సీనియారిటీ వంటి అంశాల్లో ఎదురయ్యే సమస్యలకు ఈ గుర్తింపుకార్డుతో బ్రేక్ పడనున్నది. ఆన్లైన్లో ఆటోమెటిక్గా సీనియారిటీ జాబితా జనరేట్ కావడం వల్ల దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టే వీలుంటుంది. పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు, ఫొటోలను సంబంధిత పాఠశాలల నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలనే ఆదేశాలున్నా.. మెజార్టీ స్కూళ్లల్లో బోర్డులపై వివరాలు కనిపించడం లేదు. ఇకపై ఆ నిబంధన కూడా కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే టీచర్ల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదై ఉండగా, ఇంకా మిగిలి ఉన్న వారి వివరాలను పొందుపరచాలని సర్క్యూలర్ జారీ చేసేందుకు సిద్ధమైంది. అయితే, గతంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు వేలిముద్ర ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసినా.. సాంకేతిక సమస్య వల్ల ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. మహబూబ్నగర్ జిల్లాలో 876 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 632 ప్రాథమిక, 90 ప్రాథమికోన్నత, 154 ఉన్నత పాఠశాలలు ఉండగా, 74,632 మంది విద్యార్థులు చదువుతున్నారు.
విధులకు హాజరుకాకుంటే చర్యలు..
పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బదులుగా తాత్కాలికంగా బయటి వ్యక్తులను నియమించి బోధన చేపడుతున్నారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాల వేళల్లో ప్రైవేట్ వ్యాపకాలు, రియల్ ఎస్టేట్దందాల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే తేదీ వేయకుండా రాసిపెట్టిన సెలవు చీటీని రిజిస్టర్లో పెట్టి ఎవరైనా తనిఖీకి వస్తే తేదీ వేసి సీఎల్ పెట్టడం, లేదా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టుకోవడం వంటివి విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగుచూశాయి. కొవిడ్ తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకున్నప్పటికీ మొత్తంగా ఉపాధ్యాయుల హాజరు శాతం 70 నుంచి 75 శాతానికి మించడంలేదని విద్యాశాఖ గుర్తించింది. దీంతో ఆధునాతన సాంకేతిక విధానాన్ని తప్పనిసరి చేస్తున్నది. ప్రస్తుతం ఉపాధ్యాయుల వద్ద ఎంఈవోలు జారీ చేసిన సాధారణ గుర్తింపు కార్డులు సహా, ఉపాధ్యాయ సంఘాల కార్డులు మాత్రమే ఉండగా, అధికారికంగా జారీ చేసినవి లేవు. అక్రమాలను కట్టడి చేసేందుకు సాంకేతికత జోడించి శాశ్వత ఫొటో గుర్తింపుకార్డులను ఇవ్వనున్నది. సరికొత్త విధానంతో సమయపాలన పాటించాలని, లేకుంటే రెండు సార్లు అవకాశమిచ్చి, మూడో సారి సీఎల్ పడేలా బయోమెట్రిక్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ప్రార్థనా సమయానికి వారంలో రెండు సార్లు రాకుంటే మిషన్లో ఎల్లోజోన్ సిగ్నల్ చూసి వార్నింగ్ ఇస్తుంది. మూడోసారి కూడా ఆలస్యంగా హాజరైతే రెడ్జోన్ చూపుతుంది. ఇలా చూపిన వారికి మెమోలు జారీచేసి సంజాయిషీ కోరడం లేదా ఆఫ్డే సీఎల్ వేయడం లేదా అవసరమైతే శాఖాపరమైన చర్యలకు కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది.