నెలకు రూ.2వేలు, 25కిలోల బియ్యం
స్కూళ్ల ఆయాలకు,బస్సు డ్రైవర్లకూ వర్తింపు
కరోనాతో ఉపాధి కోల్పోయిన చిరుద్యోగులు
మానవత్వాన్ని చాటుకుంటున్న ప్రభుత్వం
ఈనెల 20నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ
21నుంచి ద్వారా బియ్యం సరఫరా
వివరాలను సేకరిస్తున్న విద్యా శాఖ
నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ/ గద్వాల, ఏప్రిల్ 11: సీఎం కేసీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన చిరుద్యోగులైన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయంతో పాటుగా 25కిలోల సన్న బియ్యం ఇచ్చేందుకు ఆదేశించారు. ఈనెల 20నుంచి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకునేందుకు కార్యాచరణకు సిద్ధమైనది. కరోనా కారణంగా పారిశ్రామిక, కూలీ రంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఇటీవలే ఆయా రంగాలు ఊపందుకొన్నాయి. ఇందులో భాగంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే మళ్లీ కరోనా రెండో దశ విజృంభిస్తుండడంతో విద్యాసంస్థలు మూతబడ్డాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులైన ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందుల్లో మునిగిపోయారు. అప్పటికే మూతపడడంతో జీతాలు లేని ఉద్యోగులను ఈ పరిస్థితులు మరింత దీనస్థితికి దిగజార్చాయి. దీంతో ప్రైవేట్ ఉపాధ్యాయుల దుస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో విద్యాశాఖను ఆదేశించారు. అందులో భాగంగా ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుడికి ఆర్థికసాయం అందించేలా నిర్ణయించారు. ప్రస్తుతం పాఠశాలలు మూసివేశారు. కాగా తిరిగి తెరిచే వరకు ప్రతి నెలా ప్రభుత్వం సాయం అందించేలా కార్యాచరణ రూపొందించడం విశేషం.
ప్రతి నెలా రూ.2వేలు అందజేత
ప్రతి ప్రైవేట్ టీచర్కు నెలకు రూ.2వేలు, 25కిలోల బియ్యం ఇవ్వనున్నది. దీనికి గానూ ప్రక్రియ వేగంగా చేపట్టేలా విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించకముందు నుంచి ఉన్న ఉపాధ్యాయులను ఈ సాయానికి అర్హులుగా పరిగణించనున్నారు. ఇలా అర్హులైన ఉపాధ్యాయుల జాబితాను ఈ నెల 15వ తేదీలోపు గుర్తించి వివరాలను విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు నివేదిస్తారు. అనంతరం 19వ తేదీ వరకు వివరాలను పరిశీలించి సాయానికి చర్యలు తీసుకుంటారు. చివరగా ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నగదును ప్రైవేట్ టీచర్ల ఖాతాలో జమచేస్తారు. ఈ నెల 20వ తేదీ నుంచే ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈ సాయం అందనున్నది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఉపాధ్యాయులకు రూ.2వేల నగదు జమ అవుతున్నది. అలాగే 21వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ సాయం మళ్లీ విద్యా సంస్థలు తెరుచుకునే వరకు కొనసాగుతుంది. ఇంకా అర్హులు ఎవరి పేర్లు అయి నా నమోదు కాకుంటే కలెక్టర్లను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనికిగానూ విద్యాశాఖ రూపొందిచిన ఫారం-ఏ, ఫారం-బీని తీసుకొని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించాలి. ఫారం-ఏలో టీచర్లు, సిబ్బంది బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వా ల్సి ఉంటుంది. ఫారం-బీలో పాఠశాలల వివరాలను న మోదు చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను హెచ్ఎం లు వెబ్సైట్లో నమోదు చేయాలి. మొత్తం మీద ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందు కు రావడంతో ఆయా ఉద్యోగుల కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో గతంలో పేదలకు బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.500 చొప్పున ఆర్థికసాయం అందజేసిన ప్రభుత్వం మానవతా ధృక్పథంతో చిరుద్యోగులైన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 1,614మందికి లబ్ధి
జిల్లాలో మొత్తం 123 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో టీచింగ్ స్టాఫ్ 1,484 మంది ఉండగా నాన్ టీచింగ్ స్టాఫ్ 130మంది ఉన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం 1,614మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆపత్కాల పరిస్థితిలో వారికి చేయూతనిచ్చినైట్లెంది. ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది తమ బ్యాంకు ఖాతాలతో కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.
వివరాలు నమోదు చేస్తున్నాం
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నాం. ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రతి ప్రైవేట్ పాఠశాల టీచర్, ఉద్యోగికి రూ.2వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. అదేవిధంగా రేషన్షాపుల ద్వారా 25కిలోల బియ్యం పంపిణీ చేసేందుకు సివిల్ సైప్లె శాఖ చర్యలు తీసుకుంటున్నది.
సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం
కరోనా వల్ల ప్రైవేట్ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్న విషయం సీఎం కేసీఆర్ గ్రహించి మానవతా ధృక్పథంతో వారికి చేయూతనిస్తున్నారు. పాఠశాలలు తెరిచే వరకు ప్రతి టీచర్కు రూ.2వేలు, కుటుంబానికి 25 కిలోల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రైవేట్ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటారు.
ఇవి కూడా చదవండి
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
చిన్నారి చైత్ర వైద్యానికి సర్కారు సాయం
బీసీ స్టడీ సెంటర్లలో ఆన్లైన్ క్లాసులు