కైలాసవాహనంపై శ్రీశైలేశుడు
లక్షలాదిగా తరలివచ్చిన కన్నడ భక్తులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నేడు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం
నందివాహనంపై విహరించనున్న దేవదేవుళ్లు
మహాసరస్వతి అలంకారంలో శ్రీశైల భ్రామరి
శ్రీశైలం, ఏప్రిల్ 11: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్ఠానాలు, రుద్రహోమం, పారాయణాలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించారు. సాయంకాల పూజలు జపానుష్ఠాధి పూజలు నిర్వహించారు.
ఉత్సవమూర్తులకు పూజలు
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తులను కైలాసవాహనంపై ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. కైలాసవాహనం అధిరోహించిన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడంతో కోరిన కోర్కెలు నేరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని ఇతిహాసాలు వివరిస్తున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులను కరుణించారు. అష్టభుజాలు కలిగిన దేవి భక్తాదులకు దర్శనమిచ్చారు. వాహన పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రధాన రాజగోపురం, గంగాధర మండపం నుంచి నందీమండపం వరకు, నందీమండపం నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో కేఎస్ రామారావుతోపాటు ఈఈ మురళీబాలకృష్ణ, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పిఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్కుమార్, ఏఈవోలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకుడు ఉమేశ్ పట్వారి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.