మూసాపేట(అడ్డాకుల), ఏప్రిల్ 9 : మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎంపీపీ నాగార్జున్రెడ్డి స్పందిస్తూ.. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వేసవిలో నీటి సమస్య ఏర్పడకుండా చూడాలన్నారు. అలాగే గ్రామ సమీపంలోనే వాగు ఉన్నా ఇంటి నిర్మాణాలకు ఇసుక లభించని పరిస్థితి నెలకొన్నదని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గ్రామానికి ఒక పద్ధతి, మరో గ్రామానికి మరో పద్ధతి పాటిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఒకవైపు వందల ట్రిప్పుల ఇసుక మండలం దాటి వెళ్తుంటే పట్టించుకోని అధికారులు.. గ్రామాల్లో ఇంటి నిర్మాణాలకు ట్రాక్టర్లతో ఇసుక తీసుకొస్తే కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల అవసరాలకు ఇసుకను స్థానిక వాగు నుంచి తీసుకోవడానికి అధికారులు అనుమతులు ఇవ్వాలని మండల సమావేశంలో తీర్మాణం చేస్తున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. కాగా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలకు విద్యుత్, నీటి సరఫరాకు ఏ నిధులు వాడాలి, బాధ్యులెవరో తెలపాలని కందూరు సర్పంచ్ శ్రీకాంత్ కోరారు. ఉపాధి హామీ పథకంలో చెరువుకట్టలపై పెరిగిన కంపచెట్ల తొలగింపు పనులు చేపట్టాలని సర్పంచులు, ఎంపీటీసీలు సభ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రాచాల రాధిక, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ రాంబాయి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.