600 పడకలతో అత్యాధునిక భవనం
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 9: కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో వైద్య సేవలందిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 40మంది స్టాఫ్నర్సులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ నియామకపత్రాలు అందజేసి మాట్లాడారు. జిల్లా దవాఖానలో రూ.100కోట్లతో 600 పడకల అధునాతన దవాఖాన నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించామని, అత్యవసర బ్లాక్, ఓపీ బ్లాక్, 12 ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, రేడియాలజీ, క్యాజువాలిటీ, జనరల్ సర్జరీ తదితర విభాగాలను ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తామన్నారు. మేకనైజ్డ్ ల్యాండ్రీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అపోలో, యశోద దవాఖానకు దీటుగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ దవాఖానలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2014లో జిల్లా దవాఖానలో ప్రసవాల సంఖ్య 80 మా త్రమే ఉందని, ఇప్పడు రెండు వేలకు పైగా దాటిపోయిందన్నారు. మహబూబ్నగర్లో ప్రభుత్వ వైద్య కళాశాల, ఎస్వీఎస్ దవాఖాన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, వైద్యులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనా వైరస్ నివారణలో భాగంగా 45ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో మంత్రి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, 45ఏండ్లు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి కోరారు. కరోనాపై నిర్లక్ష్యం చేయొద్దని, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. మంత్రితోపాటు ఆయన తల్లి శాంతానారాయణ్గౌడ్, సోదరుడు శ్రీకాంత్గౌడ్ వ్యాక్సి న్ వేసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సుమారు ఆర్ధగంటపాటు మంత్రి దవాఖానలోనే వేచి ఉండే గదిలో ఉన్నారు. ఈ సందర్భంగా దవాఖాన సూపరింటెండెంట్, ఇంజినీర్లు, దవాఖాన కమిటీ సభ్యులు, జిల్లా దవాఖాన ఆభివృద్ధిపై చర్చించారు. జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శంకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, దవాఖాన ఆభివృద్ధి కమిటీ సభ్యులు వెంకన్న తదితరులు ఉన్నారు.