ఉచితంగా 57 రకాల పరీక్షలు
ప్రతి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు
పేద, మధ్యతరగతి ప్రజలకు వరం
రూ.2.30 కోట్లతో అత్యాధునిక మిషన్లు
వచ్చే నెల నుంచి అందుబాటులోకి సేవలు
రోగులకు తప్పనున్న ‘ప్రైవేట్ ల్యాబ్’ తిప్పలు
మహబూబాబాద్/ములుగు, మార్చి 28 (నమస్తే తెలంగాణ):పేదలకు ఉచిత వైద్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఉచిత పరీక్షలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రక్త, మూత్ర పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్ నిర్ధారణ, పాథాలజీ, లివర్ ఫంక్షన్ టెస్టులు.. ఇలా మొత్తం 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసేందుకు ప్రతి జిల్లా ప్రధాన వైద్యశాలల్లో ‘తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్’లను ఏర్పాటుచేస్తున్నది. రూ.2.30కోట్ల వ్యయంతో అధునాతన మిషన్లు హాస్పిటళ్లకు చేరగా, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో డ్రైరన్ కొనసాగుతోంది. వచ్చే నెల నుంచి సేవలు అందనుండగా ప్రైవేట్ ల్యాబ్ల్లో వేలకు వేలు ఖర్చు చేసే పని తప్పనుంది.
57 రకాల పరీక్షలు
జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల ద్వారా పేదలకు పరీక్షలు చేయనున్నారు. మూత్ర, రక్త పరీక్షలు, షుగర్ వ్యాధిగ్రస్తులకు అన్ని రకాల పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, లివర్ టెస్ట్లు, లిక్విడ్ ప్రొఫైల్ టెస్టులు, పాథాలజి టెస్టులు, మైక్రోబయాలజీ టెస్ట్లు ఇలా మొత్తం 57 రకాల పరీక్షలు చేస్తారు. ముందుగా పీహెచ్సీల నుంచి ప్రతిరోజూ వచ్చే టెస్టుల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం డ్రైరన్ చేస్తున్న వైద్యులు వచ్చే నెల నుంచి సేవలందించనున్నారు. అన్ని పీహెచ్సీల నుంచి నమూనాలను సేకరించి జిల్లాకేంద్రానికి తీసుకొస్తారు. వీటికి బార్కోడింగ్ వేస్తారు. పరీక్షల కోసం రోగులు సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పీహెచ్సీకి వెళ్లి టెస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ పేషెంట్ ఆధార్ నంబర్తో పాటు ఫోన్ నంబర్, ఇతర వివరాలను తీసుకొని రిపోర్ట్ రాగానే అతడి సెల్ నంబర్కు మెస్సేజ్ రూపంలో పంపిస్తారు. ప్రతి రోజూ మొబైల్ వ్యాన్ల ద్వారా పీహెచ్సీల నుంచి నమూనాలను సేకరించి జిల్లాకేంద్రానికి తీసుకొస్తారు. ఇక్కడ మిషన్ల ద్వారా పరీక్ష చేసిన తర్వాత పేషెంట్కు టెస్ట్ రిజల్ట్ చేరుతుంది. మరో కాపీ జిల్లాకేంద్రంలో ఉంటుంది. ల్యాబ్కు ఒక మేనేజర్తో పాటు నలుగురు టెక్నీషియన్లు ఉంటారు.
గంటకు 300 టెస్టులు చేయొచ్చు..
మిషన్లను ఇప్పటికే బిగించాం. డ్రైరన్ ప్రారంభించాం. జిల్లాలోని 10 పీహెచ్సీల నుంచి నమునాలను తెప్పించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇది ఒక నెల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల ద్వారా ప్రజల నుంచి నమూనాలను సేకరించి జిల్లా కేంద్రంలోనే పరీక్షలు నిర్వహిస్తాం. త్వరలో సేవలను ప్రారంభిస్తాం. 57 రకాల పరీక్షలను పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందిస్తారు. ఈ మిషన్ల ద్వారా ఒక గంటకు 200-300 టెస్టులు చేయవచ్చు. దీని వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
ములుగు ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చారు. 57 రకాల పరీక్షలను ఉచితంగా చేసేందుకు వైద్య సిబ్బందిని నియమించారు. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించి 25 రకాల పరీక్షలను ప్రతి రోజూ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల నుంచి నమూనాలను సేకరించి 24గంటల పాటు సేవలందిస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.
త్వరలో పూర్తి స్థాయి సేవలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా అన్ని పీహెచ్సీల పరిధిలోని రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. త్వరలో పూర్తి స్థాయి సేవలను అందించనున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తాం. అన్ని పరీక్షలను ఉచితంగా నిర్వహించి కచ్చితమైన రిపోర్టులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
ఇవి కూడా చదవండి