కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
గ్రేటర్ కమిషనర్ సత్పతితో కలిసి మీడియా సెంటర్ల ప్రారంభం
హన్మకొండ, ఏఫ్రిల్ 16: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అతిక్రమించవద్దని సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంతో పాటు నామినేషన్లు స్వీకరించే ములుగు రోడ్డులోని ఎల్బీ కాలేజీ, సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో కూడా మీడియా సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ న్యూస్ పేపర్లలో, లోకల్ చానళ్లలో వచ్చే వార్తలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు బీ పల్లవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ బీ భూపాల్, జీడబ్ల్యూఎంసీ డీపీఆర్వో అయూబ్ఖాన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ కే అరుణ, సహాయ పౌరసంబంధాల అధికారి ఎండీ రఫీక్ సిబ్బంది పాల్గొన్నారు.
మెప్మా కార్యాలయంలో..
వరంగల్ : ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కమిషనర్ సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీడియా సెంటర్ ద్వారా గ్రేటర్లోని 66 డివిజన్ల సమాచారాన్ని పాత్రికేయులు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మీడియా సెంటర్లో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు టెలిఫోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వర్, పీఆర్వో అయూబ్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
సువిధ సెంటర్ ఏర్పాటు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కార్పొరేషన్లో సువిధ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వివిధ అనుమతుల కోసం కార్పొరేషన్ కార్యాలయంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో వినియోగించే వాహనాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోల నిర్వహణ కోసం ఒక రోజు ముందు సువిధ సెంటర్ నుంచి అనుమతి తీసుకోవాలని కమిషనర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కాగా, సువిధ సెంటర్ నోడల్ అధికారిగా మెప్మా పీడీ భద్రునాయక్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక ఫారం
గ్రేటర్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారు ప్రత్యేక ఫారం నింపి కార్పొరేషన్ కార్యదర్శికి అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, కరోనా బాధితుల కోసం పోస్టల్ బ్యాలెట్ను ఎన్నికల సంఘం అనుమతించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారు ముందస్తుగా ఓటరు గుర్తింపు కార్డు, ఓటు వేసే డివిజన్లోని ఓటరు జాబితా పేరు ఉన్న సీరియల్ నంబర్ను ఫారంలో పూర్తి చేసి, పోస్టల్ బ్యాలెట్ పొందవచ్చు. అలాగే, నేరుగా తీసుకునే అవకాశంతో పాటు అడ్రస్కు పోస్ట్ ద్వారా పంపించే అవకాశం కూడా కల్పించారు.