మహబూబ్నగర్, సెప్టెంబర్ 29 : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని డీటీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన జాతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాటుసారా, కల్లు తయారీని వదిలేసిన వారికి పునరావసం కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. అలాగే అర్హులైన వారికి ఆర్థిక చేయూత అందించడంపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. మండలాల వారీగా నిర్దేశిత లక్ష్యం మేరకు దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఒకవేళ జిల్లాస్థాయిలో సరైన నిధులు లేకపోతే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ-ఆఫీస్లోనే కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయాలి
హరితహారం, పట్టణప్రగతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీల నుంచి మహబూబ్నగర్ రహదారులకు ఇరువైపులా బహుళ వరుసల్లో మొక్కలు నాటడంతోపాటు సెంట్రల్ మీడియన్లో మొక్కలు నాటే పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే మల్లమ్మకుంటపై ప్రత్యేకంగా సర్వే చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్కుమార్, సునీత, నూరుల్ నజీబ్, మున్సిపల్ ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు.