పలు చోట్ల దెబ్బతిన్న పంటలు గులాబ్ తుఫాన్ ప్రభావంతో జోరు వాన పడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు పాలమూరుతోపాటు బాలానగర్, మోతిఘణపూర్, నందారం, మాచారం, సూరారం, గుండేడ్, ఉడిత్యాల తదితరగ్రామాల్లో దంచికొట్టింది. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహి
స్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దుందుభీ వాగు ఉధృతంగా పారుతున్నది. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడక్కడా పంటలు నీటమునిగాయి. సూరారం, ఉడిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బాలానగర్, సెప్టెంబర్ 28: గులాబ్ తుఫాన్ ప్రభావంతో రెండ్రోజులుగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాలానగర్ మండల కేంద్రంతో పాటు మోతిఘణపూర్, నందారం, మాచారం, సూరారం, గుండేడ్, ఉడిత్యాల గ్రామాల్లో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. మండలంలోని సురారం వాగు ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహిస్తుండటంతో సూరారం మధ్య ఉడిత్యాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు.
వాగు పరిశీలన
బాలానగర్లో దుందుభి వాగును మంగళవారం సర్పంచులు పరిశీలించారు. వాగు పారడంతో చుట్టుపక్కల పంట పొలాలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు గోపినాయక్, రమేశ్నాయక్, రవినాయక్, భాస్కర్నాయక్, టీఆర్ఎస్ నాయకులు బిచ్చునాయక్, నాగేందర్నాయక్, బాబునాయక్ పాల్గొన్నారు.
దుందుభీ పరవళ్లు
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 28: జడ్చర్ల మండలంలోని కోడుగల్ దుందుభీ వాగు పొంగి ప్రవహిస్తున్నది. అల్వాన్పల్లి వద్ద వాగుపై ఉన్న చెక్డ్యాం అలుగుపారుతున్నది. తుఫాన్ ప్రభావంతో జడ్చర్ల మండలంలో మంగళవారం 18 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు. జడ్చర్ల మండలంలోని కురిసిన వర్షంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా అధికారులు అప్రమత్తమయ్యారు.
చెరువులు..అలుగులు
కోయిలకొండ, సెప్టంబర్ 28: మండలంలోని కోతలాబాద్, సురారం చెరువులు అలుగులు పారుతున్నాయి. ఇప్పటికే మండలంలోని కోయిలకొండ పెద్ద చెరువు, దమయపల్లి, అనంతాపూర్, చంద్రాస్పల్లి, ఖాజీపూర్, పారుపల్లి గ్రామాల్లో చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. పెద్ద వాగు, చిన్నవాగులు ఉధృతంగా ప్రవహించడంతో కోయిల్సాగర్లోకి నీరు చేరుతున్నది.
చౌడూర్ పెద్ద చెరువు
నవాబ్పేట, సెప్టెంబర్ 28: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చౌడూర్ పెద్ద చెరువు అలుగు పారుతున్నది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ అలుగులో చేపలు పడుతున్నారు. యన్మన్గండ్ల, ఇప్పటూర్ చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.