ప్రయాణికులకు సేవలందించడంలో రైల్వే శాఖ విచిత్రంగా ప్రవర్తిస్తున్నది. కొవిడ్ పేరుతో లోకల్
రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చింది. ప్రయాణికులు ఎక్కడం లేదని పలు స్టేషన్లలో నిలిపివేయడమే మానేసింది. దీనికి తోడు రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అయినా ప్రయాణ సమయం మాత్రం లోకల్ రైళ్లను తలపిస్తున్నది. పేరుకు ఎక్స్ప్రెస్ అని ఎక్కిన ప్రయాణికులు గమ్యస్థానాలకు మాత్రం ఆలస్యంగా చేరుతుండడంతో నరకం అనుభవిస్తున్నారు. రైల్వే శాఖ ప్రయాణికులతో చలగాటం ఆడుతున్నదని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇక రాయిచూర్ డెమో ఎక్స్ప్రెస్ రైలు గుదిబండగానే మారింది. నేడు బుల్లెట్ రైళ్లు వచ్చినా.. ఇక్కడ మాత్రం పరిస్థితి మారడం లేదు. ఆదాయంలో ముందుండే దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు, కొత్త లైన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రైల్వే శాఖ లోకల్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చి గందరగోళానికి గురిచేస్తున్నది.
మహబూబ్నగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ఆగిన రైళ్లు తిరిగి ప్రారంభమైనా.. ప్రయాణికులకు సేవలందించే విషయంలో రైల్వే శాఖ తీరు విచిత్రంగా మారుతున్నది. కరోనా పేరు చెప్పి లోకల్ రైళ్లను ఎక్స్ప్రెస్గా మార్చి రెట్టింపు చార్జీలు వసూలు చేసినా.. వేగం, ప్రయాణ సమయం మాత్రం లోకల్ వద్దే ఆగిపోయాయి. దీంతో ఎక్స్ప్రెస్ రైలు అని ఎక్కే ప్రయాణికులకు గమ్యస్థానం చేరేందుకు ఆలస్యమవుతున్నది. అప్పటికే ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయంతో పోలిస్తే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ లోకల్ ఎక్స్ప్రెస్ రైళ్ల తీరు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నది. లోకల్ రైళ్లకు ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ రైల్వే శాఖ ప్రయాణికులతో చెలగాటం ఆడుతున్నది. ఆదాయంలో ముందుండే దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు, లైన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసే రైల్వే శాఖ ఇప్పుడు లోకల్ రైళ్లను ఎక్స్ప్రెస్గా మార్చి గందరగోళానికి గురిచేస్తున్నదని ప్రయాణికులు వాపోతున్నారు. బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని గర్వంగా చెప్పుకునే రైల్వే శాఖ ఇంకా తమ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్యాసింజర్ రైళ్ల కంటే ఆలస్యంగా నడుస్తున్నాయని మాత్రం గుర్తించడం లేదు.
నత్తకు నడక నేర్పే రైళ్లు..
గుంటూరు నుంచి కాచిగూడ వరకు తిరిగే ప్యాసింజర్ రైలును కరోనా పేరుతో ఎక్స్ప్రెస్గా మార్చారు. చార్జీలు రెట్టింపు చేశారు. అయితే మిగతా ఎక్స్ప్రెస్ రైళ్లు చేరుకునే సమయంలో మా త్రం ఈ రైలు వెళ్లడం లేదు. సాధారణంగా కర్నూల్ నుంచి గద్వాల, మహబూబ్నగర్ మీదుగా కాచిగూ డ చేరుకునేందుకు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. కానీ, గుం టూరు నుంచి వచ్చే రైలుకు మాత్రం అధికారికంగానే 8 గంటల సమయం పడుతుంది. కర్నూల్లో మధ్యాహ్నం 2:28 గంటలకు బయలుదేరే ఈ రైలు కాచిగూడ చేరేందుకు రాత్రి 10:35 అవుతున్నది. ఇవి అధికారిక వేళలు మాత్రమే. అయితే మనం ప్రయాణించాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు. శనివారం రాత్రి 10:35 గంటలకు కాచిగూడ చేరాల్సిన ఈ రై లు సుమారు రెండు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 12:12కు చేరుకున్నది. అంటే కర్నూల్ నుంచి కాచిగూడ చేరుకునేందుకు ఎక్స్ప్రెస్ రైలుకు సుమారు 10 గంటల సమయం పడితే రైల్వే ప్రయాణికుల పరిస్థితి ఏం కావాలి. మహబూబ్నగర్ మీదుగా గుంటూరు నుంచి కాచిగూడ, కాచిగూడ నుంచి గుంటూరు తిరిగే రైళ్ల పరిస్థితి ప్రయాణికులకు విసుగు తెప్పిస్తున్నది. ఫలక్నుమా నుంచి గొల్లపల్లి వరకు డబ్లింగ్ పూర్తయినా రైళ్ల వేళలు మాత్రం సవరించలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అనేక రైళ్లు రద్దు చేసినా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లనన్నా సకాలంలో తిరిగేలా చూడాలని కోరుతున్నారు.
అంతా మా ఇష్టం..
దేశంలోనే అత్యధిక ఆదాయం అందించే దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం, అధికారులు శీతకన్ను వేస్తున్నారు. తెలంగాణకు కొత్త రైళ్లు, లైన్లు కేటాయించకుండా అన్యాయానికి గురి చేస్తున్నారు. ఉత్తరాదికి బుల్లెట్ రైలిచ్చి మనకు ప్యాసింజర్ రైళ్లు కూడా ఇవ్వడం లేదు. ఎనిమిది ఏండ్ల కిందట ప్రారంభించిన గద్వాల- రాయిచూరు రైల్వే లైన్లో నేటికీ వేళాపాళాలేని ఒక్క డెమో రైలు మాత్రమే నడుస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఆ రైలు కూడా ఎవరికీ అందుబాటులో లేని వేళల్లో తిప్పుతూ ప్రయాణికులు తిరగని మార్గంగా ముద్ర వేస్తున్నారు. పెద్దగా ఆక్యుపెన్సీ లేని మార్గంగా చూపిస్తూ కొత్త రైళ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డెమో రైలుకు ఎక్స్ప్రెస్ బోర్డు తగిలించి తిప్పుతున్నారు. ఈ రైలులో కనీస సౌకర్యాలుండవు. మొబైల్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉండని ఈ రైలుకు ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దగా చేస్తున్నారు. ఎక్స్ప్రెస్గా మార్చి.. వేళలను సవరించలేదు. అక్టోబర్ 15వ తేదీన రాయిచూరులో సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన ఈ రైలు కాచిగూడకు రాత్రి 10:55 గంటలకు చేరుకోవాల్సి ఉండగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత 2:06 గంటలకు చేరుకున్నది. దాదాపు 3 గంటలకు పైగా ఆలస్యంగా చేరుకుంటే వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్యం బాగా లేని వారి పరిస్థితి ఏంటి..? ఈ రైలులో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురయ్యాక ఎవరైనా ధైర్యం చేసి మరోసారి ప్రయాణిస్తారా..? ఇది రైల్వే శాఖాధికారులకు అర్థం కావడం లేదు. రాయిచూరు నుంచి యాద్గిర్, తాండూరు మీదుగా చుట్టూ తిరిగి సుమారు 290 కి.మీ ప్రయాణించే రైళ్లు కేవలం 4 నుంచి 5 గంటల్లో వస్తున్నాయి. కానీ రాయిచూరు నుంచి గద్వాల, మహబూబ్నగర్ మీదుగా కాచిగూడ వెళ్లే డెమో ఎక్స్ప్రెస్ మాత్రం 238 కి.మీకు అధికారికంగా 6 గంటలు.. అనధికారికంగా మరో రెండు, మూడు గంటలు అధికంగా సమయం తీసుకుంటున్నది. ఆర్టీసీ బస్సులో వచ్చినా కేవలం 5 నుంచి 6 గంటల్లో హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటే.. ఎప్పుడు గమ్యం చేరుకుంటుందో తెలియని రైలులో ప్రయాణించేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. అందుకే ఈ రైలులో ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం కనిపించదు. అయినా రైల్వే శాఖ అధికారుల్లో మాత్రం వీసమెత్తు కూడా చలనం రాదు. ఏదో మొక్కుబడిగా లైన్ వేశాం. ఆ లైన్ పై ఓ రైలు తిప్పుతున్నాం అన్నట్లుగా మారిపోయింది.
ఎక్కువ సమయం పడుతున్నది..
రాయిచూరు నుంచి సాయంత్రం 5 గంటలకు బ యలుదేరే డెమో రైలును ఎక్స్ప్రెస్గా మార్చి చాలా చిన్న చిన్న స్టేషన్లలో ఆపకుండా తిప్పుతున్నారు. కానీ, వేళలు మాత్రం మార్చలేదు. దీంతో లోకల్ ప్రయాణికులు ఎక్కడంలేదు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఎక్కుతున్నారా అంటే అదీ లేదు. రూ.కోట్లు ఖ ర్చు పెట్టి ఓ రైల్వే లైన్ వేసిన అధికారులు కనీసం రెం డు రైళ్లు అయినా తిప్పడం లేదు. తిరుగుతున్న ఒక్క రైలు వేళలను ప్రయాణికులకు అనుకూలంగా మార్చ డం లేదు. రాయిచూరు- కాచిగూడ మధ్య ప్రయాణానికి సుమారు 8 గంటల కు పైగా సమయం తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేసుకునేందుకు కూడా సౌకర్యం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు గమ్య స్థానం చేరుకుంటుందో తెలియని రైలు ఎవరెక్కుతారు. అందుకే ఓసారి రైల్వే శాఖ ఉన్నతాధికారులను ఈ రైలు ఎక్కించాలి. అప్పుడే ప్రయాణికుల కష్టాలు తెలుస్తాయి.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
కరోనా పేరిట ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్గా మా ర్చారు. కానీ వాటి ప్రయాణ సమయం మాత్రం మా రలేదు. మిగతా ఎక్స్ప్రెస్ రైళ్లకు వసూలు చేస్తున్నట్లుగానే చార్జీలు వసూలు చేస్తున్నప్పుడు ప్రయాణ వేళలు కూడా కుదించాలి. రైల్వే అధికారుల తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళ ప్ర యాణించే హంద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడ చేరేందుకు అ ధికారిక వేళల ప్రకారం ఉదయం 10 అవుతుంది. కా నీ, అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకునేందుకు 50 నిమిషాలు పడుతుంది. క్రాసింగ్ పేరు చెప్పి సీతాఫల్మండి వద్ద సుమారు గం టకు పైగా ఆపేస్తున్న సందర్భాలున్నాయి. అదే సమయంలో కాచిగూడలో 10:11 గంటలకు బయలుదేరే ఎంఎంటీసీ (లోకల్) రైలు కేవలం 29 నిమిషా ల్లో సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాం.