జడ్చర్లటౌన్, అక్టోబర్17: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టుకాలనీలు నీటమునిగాయి. ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తోడుగా మేమున్నామంటూ మున్సిపాలిటి పాలకవర్గ సభ్యులు భరోసానిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తమవంతు సహకారాన్ని అందించి అండగా నిలిచారు. మున్సిపాలిటి పరిధిలోని రాజీవ్నగర్ కాలనీలో ఇండ్లల్లోకి వరద నీరు చేరి నిత్యావసర సరుకులు తడిసిపోయిన విషయాన్ని తెలుసుకున్న కౌన్సిలర్ సతీశ్ వెంటనే తనవంతుగా అన్నం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను అందజేశారు. 4వ వార్డులో శంకర్(దేవా) కాలనీల్లో తిరిగి ఇండ్లల్లో చేరిన వరద నీటి బయటకు తోడేందుకు సహకరించారు. 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలత నల్లకుంట చెరువుకట్ట గండి పడిన విషయాన్ని తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పూడ్చివేయించారు. 17వ వార్డు కౌన్సిలర్ చైతన్యగౌడ్, 24వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్రెడ్డి, 25వ వార్డు కౌన్సిలర్ లత పట్టణంలోని లోతట్టుకాలనీల ప్రజలకు తమవంతుగా సహకరించారు. ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ సునీతతో పాటు కౌన్సిలర్లు సత్వరమే స్పందించి నీట మునిగిన కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు కాలనీల్లో చేరిన వరదనీటిని మున్సిపల్ సిబ్బంది చేత బయటకు తోడేశారు. పారిశుధ్య పనులు చేపట్టారు. మురికి కాలువల పొడవునా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. వరద నీరు ఇండ్లల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. ప్రకృతి వైపరిత్యం నెలకొన్న సందర్భంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నేపథ్యంలో ఓవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం రాజకీయ విమర్శలతో సరిపెట్టుకోగా, మరోవైపు ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులను ప్రజలు అభినందిస్తున్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
జడ్చర్లటౌన్, అక్టోబర్17: మున్సిపాలిటీ పరిధిలో కురిసిన భారీ వర్షానికి వాల్మీకినగర్కాలనీకి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తక్షణమే బాధిత కుటుంబానికి రూ.25 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఆదివారం జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, కౌన్సిలర్లు చైతన్య, లత, దేవా, ప్రశాంత్రెడ్డి, నందకిశోర్తో పాటు టీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పంపించిన రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్, రాంమోహన్, సోహేల్, దామోదర్, నర్సింహ, అర్జున్, నాగరాజు పాల్గొన్నారు.