ముషీరాబాద్ :వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగురామూర్తి పంతులు అని జస్టిస్ బి.మధుసూదన్ అన్నారు.ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలుగు భాషోద్యమ నాయకులు గిడుగు రామూర్తి పంతులు జయంతి సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ మధుసూదన్ ముఖ్య అతిధిగా పాల్గొని రామూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బహుభాషావేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్తగా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప కవి గిడుగు రామూర్తి పంతులు అని కొనియాడారు. తెలుగులో వాడుక భాషోద్యమ పితామహుడుని, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని విలువను తెలియచేసిన మహనీయుడని అన్నారు.
గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం, గిడుగు ఫౌండేషన్ అధ్యక్షులు గిడుగు కాంతి కృష్ణ, రచయిత సుదర్శన్, ముదిగొండ గోపి కృష్ణ తదితరలు పాల్గొన్నారు.