ఖమ్మం, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా తగ్గుముఖం పట్టింది. గురువారం ఉధృతంగా ప్రవహించిన గోదావరి శుక్రవారం కొద్దిగా తేలికపడింది. గురువారం రాత్రి 10గంటలకు 52.50అడుగులకు చేరుకున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 9గంటల వరకు 52.50అడుగులతో నిలకడగా ఉంది.
ఉదయం 11గంటల నుంచి గంటకు 10ఇంచులు తగ్గుతూ వచ్చింది. సాయంత్రం 7గంటల వరకు 52అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక యధావిధిగా కొనసాగిస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గినా అనేక గ్రామాలు జలదిగ్భంధంలోనే చిక్కుకున్నాయి. రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, సారపాక బూర్గంపాడు, పినపాక, అశ్వాపురం వంటి ప్రాంతాల్లో వరద సృష్టించిన బీభత్సంతో అనేక మంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యలో సహాయక చర్యలు కొనసాగతున్నాయి.
క్రమణా తగ్గుముఖం పడుతున్న గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం చర్ల వైపు గోదావరి రహదారిపై ఇంకా పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభం కాలేదు. జలదిగ్భంధం నుంచి గ్రామాలు తేరుకోవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి వరద నీటి మట్టం తగ్గుతున్నా.. చాలా నిదానంగా తగ్గుతుండడంతో శుక్రవారం ఉదయం నుంచి కేవలం 50ఇంచులు మాత్రమే తగ్గుదల ఉంది.
దుమ్ముగూడెం, ఆగస్టు 12: దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 25 అడుగుల వద్ద నిలకడగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
పర్ణశాల, ఆగస్టు 12: పర్ణశాల వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా గోదావరి నీటి మట్టం పెరుగుతూ.. తగ్గుతూ దోబూచులాడుతున్నది. దీంతో, ముందస్తుగా ముంపు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. సీతమ్మ నార చీరెల ప్రాంతం నెల రోజులుగా నీటిలోనే మునిగి ఉంది. గోదావరి వరదల కారణంగా పర్ణశాల పుణ్య క్షేత్రానికి యాత్రికులు రాకపోవడంతో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేయడం లేదు.
భద్రాచలం, ఆగస్టు 12: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్నందున ముంపు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మణుగూరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సంబంధిత అథికారులకు సమాచారం తెలిపేందుకు ఐటీడీఏలో శుక్రవారం కంట్రోల్ రూం ఏర్పాటైంది. వరద సమాచారం తెలుసుకునేందుకు కంట్రోల్ రూం సెల్ నంబర్ 86390 79188, ల్యాండ్ నంబర్ 08743-232244కు కాల్ చేసి తెలుసుకోవచ్చని ఏపీవో (జనరల్) డేవిడ్రాజ్ తెలిపారు.