జిల్లాలో 2,73,355 ఇండ్లకు మిషన్ భగీరథ జలాలు
రూ.345 కోట్లతో ఇంటింటికీ తాగు నీరు
2,200 కిమీ కొత్తగా పైప్ లైన్లు
20 మండలాల్లో 582 కొత్త ట్యాంక్ల నిర్మాణం
పాలేరు, వైరాల్లో 24/7 గంటలు తాగునీటి శుద్ధి
969లో గ్రీన్ జోన్ పరిధిలో 820 హెబిటేషన్లు
కూసుమంచి, ఏప్రిల్ 10 : నాడు నీటి కోసం కొళాయిల వద్ద కొట్లాటలు.. ట్యాంకర్ల ద్వారా నీటి తరలింపు.. వ్యవసాయ బావుల నుంచి నీటిని అద్దెకు తీసుకోవడం.. బోర్లతో పడరాని పాట్లు, బిందెడు నీటి కోసం గంటల తరబడి నిరీక్షణ.. పంపులు వచ్చాయంటే నీటి కోసం ఎగబడిన సందర్భాలు పోయాయి. ప్రతి రోజూ శుద్ధజలం సరఫరా అవుతుండడంతో ప్రజల క‘న్నీటి’ కష్టాలు తీరాయి. జిల్లాలో రూ.345 కోట్లతో 2,73,255 నివాస గృహాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా యజ్ఞంలా చేపట్టిన మిషన్ ’భగీరథ’ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తున్నది. తాగునీరు కోసం అలమటించే రోజులు పోయాయి. ప్రభుత్వమే ఇంటింటికే నల్లాలు బిగించి శుద్ధజలం సరఫరా చేస్తున్నది. 969 హెబిటేషన్లకు 826 వరకు గ్రీన్ జోన్ కింద నీటి సరఫరా జరుగుతున్నది. వ్యక్తికి 100 లీటర్ల కంటే అదనంగా నీరందిస్తే దానిని గ్రీన్ జోన్గా పరిగణిస్తారు. జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా కొత్తగా 582 మంచి నీటి ట్యాంక్లను నిర్మించారు. వాటితోపాటు గతంలో ఉన్న పాత ట్యాంక్లు 901 ఆధునీకరించి ఉపయోగంలోకి తెచ్చారు. జిల్లాలో 1,483 ట్యాంక్ల ద్వారా నిత్యం తాగునీరు సరఫరా చేస్తున్నారు.
2,200 కి.మీ పైపు లైన్
జిల్లాలో 4,200 కిమీ పైప్లైన్తో తాగునీరు సరఫరా అవుతున్నది. కొత్తగా 2,200 కి.మీ పైప్లైన్ మిషన్ భగీరథలో వేశారు. గతంలో పాత స్కీంల ద్వారా వేసిన పైపులైన్ మరమ్మతులు చేసి వాటిని ఉపయోగంలోకి తెచ్చారు. ప్రతి గ్రామంలో శుద్ధజలం ఇంటికి చేరడంతో ప్రజలకు దశాబ్ధాలుగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. తండాలు, చిన్నచిన్న కాలనీలు గ్రామ పంచాయతీలుగా మారడం, ప్రతి ఇండ్ల సముదాయాన్ని హెబిటేషన్గా పరిగణించడంతో తాగు నీటికి ఇబ్బంది కలుగకుండా మంచినీటి సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజు నీటి సరఫరా పట్టికతోపాటు అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డును ట్యాంక్ల వద్ద ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా డీఈ, జేఈలు పర్యవేక్షిస్తున్నారు.
మూడు విభాగాలుగా తాగు నీటి సరఫరా..
జిల్లాలో తాగునీరు సరఫరా జరిగే గ్రామాలను మూడు భాగాలుగా విభజించారు. వాటిల్లో మనిషికి 100 లీటర్ల కంటే ఎక్కువగా నీరందించే గ్రామాలను గ్రీన్ జోన్గా, మనిషికి 100 లీటర్ల కంటే తక్కువ నీరు ఇచ్చే గ్రామాలను ఆరెంజ్ జోన్గా, మిషన్ భగీరథ ద్వారా నీరు అందని గ్రామాలను రెడ్ జోన్గా విభజించారు. జిల్లాలో 969 ఆవాస ప్రాంతాలు (హెబిటేషన్లు) ఉన్నాయి. 11గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. ఇటీవల కొత్త ప్రాంతాల్లో 20 కుటుంబాలతో నూతనంగా ఇండ్లు నిర్మాణం చేపట్టడంతో అలాంటి కాలనీలకు ఇంకా నీటిసరఫరా జరగాల్సి ఉంది. గ్రీన్ జోన్-820, ఆరెంజ్ జోన్ -138, రెడ్జోన్-11గా నిర్ణయించారు.
పాలేరు, వైరా కేంద్రాలుగా నీటిశుద్ధి..
పాలేరు, వైరా రిజర్వాయర్ వద్ద 24/7 గంటలు నీటిశుద్ధి జరుగుతుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద గల పాలేరు జలాశయం నుంచి జిల్లాకు తాగునీరు అందుతుంది. సాగర్ ఎడమ కాలువ రెండోజోన్ ద్వారా వైరాకు నీరు సరఫరా చేస్తున్నారు. వైరాలో నీటిని శుద్ధిచేసి 11 మండలాలకు తాగునీరందిస్తున్నారు. పాలేరులో పరిధిలో గతంలో కూసుమంచి మండలం గుర్వాయిగూడెంలో శుద్ధి చేసే ప్లాంట్ను ఉపయోగించుకొంటున్నారు. పాలేరు, వైరా, గుర్వాయిగూడెం పాత సోర్సును కూడా వినియోగిస్తున్నారు. జిల్లాలో మూడు కేంద్రాల్లో నీటిని శుద్ధి చేస్తున్నారు. గతంలో 18 గంటలు మాత్రమే నీటిని వివిధ రకాల ప్రయోగాలు చేసి వాటిని శుద్ధిచేసి అందించేవారు. కానీ వేసవి సమీపిస్తుండడంతో 24 గంటలు నీటిశుద్ధి చేస్తున్నారు. నిత్యం ల్యాబ్ల్లో పరిశీలించి నీటిని సరఫరా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కేయూ భద్రతా సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేత
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ఆరంభం