ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 2: వేదమంత్రాలు, స్థానికుల హర్షధ్వానాల నడుమ శుక్రవారం ఆధునిక వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కాల్వొడ్డుకు చేరుకున్న కేటీఆర్.. రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంతరెడ్డిలతో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. తొలుత మంత్రులకు త్రీటౌన్ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శిలాఫలకం వద్దకు చేరుకున్న మంత్రి కేటీఆర్కు పద్మశ్రీ, వనజీవి రామయ్య పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిని మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.2 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం వద్ద ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్ ఫొటోలు దిగారు. అనంతరం మెప్మా ప్రాజెక్టు మహిళలు మంత్రి కేటీఆర్ను కలిశారు. తాము తయారు చేసిన జ్యూట్బ్యాగులను చూపించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇలాంటి సంచులను తయారు చేస్తున్న మహిళలను మంత్రులు అభినందించారు. అక్కడి నుంచి నేరుగా వైకుంఠధామం చివరి వరకు వెళ్లిన కేటీఆర్.. మున్నేరువాగును పరిశీలించారు. వాగుపై ఏర్పాటు చేసే చెక్డ్యాములు, ఇతర పనుల గురించి కలెక్టర్ కర్ణన్, మంత్రి పువ్వాడలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దహన వాటికను, గ్రీనరీని, ఇతర వసతులను పరిశీలించారు. నిర్మాణ పనులు, డిజైన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మేయర్ పాపాలాల్, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.