జమ్మికుంట, అక్టోబర్19: ‘బీజేపీ అంటేనే.. పెట్రోల్ వాతలు, డీజిల్ మోతలు.. అడ్డూ అదుపులేకుండా పెంచుకుంటూ పోతున్నది. వంట గ్యాస్ను పేదలకు గుదిబండగా మార్చింది. ఆ పార్టీకి ధరలు పెంచుడు తప్ప ఏదీ చేతకాదు. ప్రజలు సంతోషంగా ఉంటే ఆ పార్టీకి నచ్చది. బాగుపడితే అసలే మెచ్చది. పూర్తిగా దళిత వ్యతిరేకి. ఆ పార్టీ నేతలు దళితబంధుపై కుట్ర చేసి ద్రోహులుగా మిగిలిన్రు. పథకాన్ని వాళ్లు ఎన్ని రోజులు ఆపగలరు.. మా అంటే ఇంకో పది, పదిహేను రోజులు. ఆ తర్వాత యథావిధిగా కొనసాగుతది. ఇట్లాంటి కుట్రలు చేసే.. ధరలు పెంచే.. ప్రజలకు అన్యాయం చేసే పార్టీ మనకు అవసరమా..? ఆలోచించండి. వచ్చే ఉప ఎన్నికలో ఆ పార్టీని బొందపెట్టాలి.. కేంద్రానికి షాక్నివ్వాలే’ అని మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని సరిత కాటన్ మిల్లులో కాంగ్రెస్కు చెందిన 300 మంది సీనియర్ నాయకులు మంత్రి హరీశ్రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువాలు కప్పారు. పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ‘కాంగ్రెస్, బీజేపీలు దేశంలో కొట్టుకుంటయ్. హుజూరాబాద్ నియోజకవర్గం లో మాత్రం ఒక్కటైతయ్. చీకట్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటయ్. బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలను తిప్పికొట్టాలే. తన స్వార్థ రాజకీయం కోసం రాజీనామా చేసిన ఈటలకు గుణపాఠం చెప్పాలే. టీఆర్ఎస్కే ఓటెయ్యాలే. పేదింటి బిడ్డ గెల్లు సీనునే గెలిపించాలే. మరో రెండేళ్లు అధికారంలో ఉంటం. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తం..’ అని ఉద్ఘాటించారు. దళిత, గిరిజన, ముస్లిం, క్రిస్టియన్ వ్యతిరేక పార్టీ బీజేపీకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అమ్ముడుపోయింది: మంత్రి కొప్పుల
బీజేపీకి కాంగ్రెస్ అమ్ముడు పోయిందని, ఈ రెండు పార్టీలకు ప్రజలు ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రెండు పార్టీల చీకటి ఒప్పందాలకు మనస్తాపానికి గురైన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాయకులందరికీ స్వాగతం చెప్పా రు. కలిసికట్టుగా పనిచేసి, గెల్లు సీనును గెలిపించుకుని సత్తా చాటాలని కోరారు. హమాలీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతల చేరికలు.. హమాలీల మద్దతు
మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకులు 300మంది టీఆర్ఎస్లో చేరారు. తర్వాత కాటన్ మిల్లుల్లో పనిచేసే హమాలీ కార్మికులు 300మంది టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఏకగ్రీవ తీర్మానాలు చేసి మంత్రులకు అందించారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. గెల్లు సీనును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతినబూనారు. రా మగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, నాయకులు రాజ్కుమార్, మల్లయ్య, కోటి, మల్లారెడ్డి, సమ్మిరెడ్డి, కశ్యప్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు హాజరయ్యారు.
సిరిసేడులో జైకొట్టిన బీజేపీ నాయకులు..
ఇల్లందకుంట, అక్టోబర్ 19: సిరిసేడుకు చెంది న బీజేపీ నాయకులు రౌతు భాస్కర్, గుంటి రా జు, రౌతు మొగిలి, రౌతు రాములు ఎమ్మెల్యే సుం కె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్య క్రమంలో సర్పంచ్ రఫీఖాన్, ఎంపీటీసీ చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర్ర రమేశ్, టీఆర్ఎస్ నాయకులు తారక్, రాజశేఖర్ ఉన్నారు.