ఇప్పటికే చెక్ డ్యాం, కేబుల్ బ్రిడ్జి పనుల్లో వేగం
రిటైనింగ్ వాల్స్కు314 కోట్లు విడుదల
పనుల కోసం స్పెషల్ అథారిటీ
తాజాగా మంత్రులు కేటీఆర్, గంగుల,శ్రీనివాస్గౌడ్ సమీక్ష
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 12 : కరీంనగర్కు పర్యాటక శోభ తీసుకురావడంలో భాగంగా నగర శివారులో చేపట్టనున్న ‘మానేరు రివర్ ఫ్రంట్’ ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానున్నది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి, చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తి దశకు చేరుకోగా, తాజాగా ప్రాజెక్టులో కీలకమైన నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అందుకు సంబంధించిన జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో స్వయంగా మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు. కాగా, శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రాజెక్టులో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా పర్యాటకంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కాగా, ప్రాజెక్టులో భాగంగా డ్యాం నుంచి 6 కిలోమీటర్ల వరకు మానేరు నదిని పూర్తిస్థాయిలో నింపి వాటిలో బోటింగ్కు అనువుగా చేయడం, నదికి ఇరువైపులా థీం పార్కు, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. నదికి ఇరువైపులా పచ్చదనం పెంచడంతోపాటు పలు కంపెనీలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇప్పటికే సాగుతున్న పనులు..
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వరంగల్ పాత రోడ్డు పై 186 కోట్లతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి దశకు చేరుకున్నది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా, ఇరువైపులా రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులు వేగం గా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే కరీంనగర్లోని కమాన్ నుంచి నేరుగా వ రంగల్ రోడ్డుకు చేరుకునే అవకాశముంటుంది. దీని వల్ల అల్గునూర్ వంతెనపై ఒత్తిడి తగ్గుతుంది. మరోవైపు ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఆరు చెక్ డ్యాంల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఐదు చెక్ డ్యాం పనులు తుది దశకు చేరగా ఆరో చెక్ డ్యాం పనులు వడివడిగా సాగుతున్నాయి.
పర్యాటక కేంద్రం మానేరు
మానేరు జలాశయంతోపాటు దీనికి దిగువన ఉన్న మానేరు నదిని పూర్తి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే, డ్యాంలో కేసీఆర్ ఐలాండ్ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతుండగా డ్యాం కింద మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ నది రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి తాజాగా, 314 కోట్ల నిధులు విడుదల చేశారు. వీటితో వాల్స్ నిర్మాణంతో పాటు సుందరీకరణకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు స్పెషల్ అథారిటీని ఏర్పాటు చేయాలని శనివారం మంత్రుల సమక్షంలో జరిగిన సమీక్షలో నిర్ణయించారు. చేపట్టబోయే పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఈ అథారిటీ ద్వారా పూర్తి చేయాలని మంత్రులు పేర్కొన్నారు. అలాగే, నదికి ఇరువైపులా సుందరీకరణకు సంబంధించి భూ సేకరణ, ఇతర పనులను రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల ద్వారా వేగంగా చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. పర్యాటకంగా అందరినీ ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రులు సూచనలు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే నగరానికి పర్యాటక శోభ రానుంది.
నిధులు విడుదలపై హర్షాతిరేకాలు
రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఒకేసారి 314.46 కోట్ల నిధులు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ మేరకు శనివారం స్థానిక కేబుల్ బ్రిడ్జిపై టీఆర్ఎస్ కరీంనగర్ కార్పొరేటర్లు, నాయకులు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఒకేసారి ఇన్ని నిధులు విడుదల చేయడం సీఎం కేసీఆర్కు కరీంనగర్పై ప్రత్యేకంగా ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.
ఇప్పటికే నగరంలో రోడ్ల అభివృద్ధికి 110 కోట్లు, అలాగే నగరాభివృద్ధికి మూడు విడుతల్లో 350 కోట్లు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చేపడుతున్న ప్రాజెక్టుకు భారీగా నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా ఇప్పటికే 80 కోట్లతో చెక్ డ్యాంలు, 190 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వీ రాజేందర్రావు, గంట కళ్యాణి, తోట రాములు, కాశెట్టి శ్రీనివాస్, సుధగోని మాధవి, గందె మాధవి, నేతికుంట యాదయ్య, ఐలేందర్యాదవ్, నాయకులు అర్ష మల్లేశం, ఎడ్ల అశోక్, సుంకిశాల సంపత్రావు, తదితరులు పాల్గొన్నారు.