నవరాత్రులు మండపాల్లో కొలువుదీరి పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ‘గణపతి బప్పా మోరియా.. అగిలే బరస్ తు జల్దీ ఆ’ అనే నినాదాలు మార్మోగాయి. గతేడాది కరోనా నేపథ్యంలో వేడుకలు నిరాడంబరంగా సాగాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వేడుకలు అంబరాన్నంటాయి. శోభాయాత్రలో యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. డీజేలు, బ్యాండు మేళాలు, డప్పు చప్పుళ్లు హోరెత్తాయి. ఉమ్మడి జిల్లాలో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
కామారెడ్డి/ కామారెడ్డిటౌన్/ విద్యానగర్, సెప్టెంబర్ 19: ఉరూవాడా వినాయక నిమజ్జనోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. చిన్నా, పెద్దా తేడా లేకుండా డప్పు చప్పుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ సంబురాల్లో మునిగితేలారు. జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. విశ్వ హిందూ పరిషత్ గణేశ్ ఉత్సవ సమితి అధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలేక్టర్ జితేశ్ వి పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్రెడ్డి, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు , వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువజన సమాఖ్య గణపతి వద్ద ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. సిరిసిల్లారోడ్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర స్టేషన్రోడ్, సుభాష్ రోడ్, వీక్లీ మార్కెట్ రోడ్, పాంచ్ చౌరస్తా మీదుగా గోపాల స్వామి రోడ్, పెద్ద బజార్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు, టేక్రియాల్ చెరువు వరకు ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. భారీ క్రేన్లతో గణనాథులను చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్పీ శ్వేతారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 55 మంది ఏఎస్సైలతోపాటు 200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.