బాన్సువాడ, సెప్టెంబర్ 17: మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో చేపపిల్లలను దళారులు చెరువుల్లో వేసి చేపలు పెద్దగా అయిన తరువాత తక్కువ ధరకు విక్రయించేలా మత్య్సకారులతో ఒప్పందం కుదుర్చుకునే వారని , దీంతో లాభం వచ్చేది కాదన్నారు. దళారీ వ్యవస్థను శాశ్వతంగా రూపుమాపడానికే వందశాతం రాయితీ పై సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి లక్షా 71 వేల చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమైక్య పాలనలో ఏ ప్రభుత్వమూ చేప పిల్లలను ఉచితంగా ఇవ్వలేదన్నారు. స్వరాష్ట్రం లో ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులు, చెరువులు, సాగునీటి వనరుల్లో రూ.92 కోట్లతో 100 కోట్ల చేపపిల్లలను ఏటా విడుదల చేస్తోందని తెలిపారు. దేశంలో మత్స్య కార్మికులకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందిస్తోంది మన రాష్ట్రమే అని పేర్కొన్నారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపపిల్లలను విడుదల చేయడం ద్వారా మత్య్సకారుల కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్ , తహసీల్దార్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, కౌన్సిలర్లు నందకిశోర్, హకీం, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సమీకృత మత్య్స అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లల పంపిణీ
కల్కి చెరువులో చేప పిల్లలను
విడుదల చేసిన సభాపతి పోచారం