బాన్సువాడ, సెప్టెంబర్ 17 : బాన్సువాడ ఏరియా దవాఖానలో ఆధునిక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన బోడ గంగారెడ్డి , శారద దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రూ. 30 లక్షలతో ఏరియా దవాఖానలో ఐసీయూ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, దాతలు బోడ ప్రమోద్ రెడ్డి, బోడ విక్రం రెడ్డి, అనూష రెడ్డితో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో దవాఖానకు నాలుగు వెంటిలేటర్లు వచ్చాయని తెలిపారు. కొత్తగా రెండు కలుపుకొని మొత్తం ఆరు వెంటిలేటర్లు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం దాతలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ఎలక్ట్రిక్ బగ్గీలో పట్టణంలోని మాతా శిశు దవాఖానకు వెళ్లారు. అక్కడ దాతలకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. ఐసీయూ వార్డు కోసం అవసరమైన అన్ని పరికరాలను దాతలు అందించారని, ఇందుకు బోడ గంగారెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నుంచే నర్సింగ్ కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.