కామారెడ్డి టౌన్,సెప్టెంబర్ 16: జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలని, అందుకోసం వైద్యశాఖాధికారులు ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయిలో పీహెచ్సీలను యూనిట్గా తీసుకొని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముందస్తుగా ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి వివరాలు, వేయించుకోని వారి వివరాలను సేకరించాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. వీఆర్ఏల సహకారం తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి స్టిక్కర్లను అతికించాలని వైద్యాధికారులకు సూచించారు. మండల స్థాయిలో ఎంపీవో, వైద్యాధికారి, జిల్లా స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్ కేంద్రాల్లో వార్డుల వారీగా వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వంద శాతం పూర్తయిన వార్డుల కౌన్సిలర్లను సన్మానించాలన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, వైద్యులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
విద్యానగర్, సెప్టెంబర్ 16 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. గురువారం ఆయన పట్టణంలోని 40వ వార్డులో వ్యాక్సినేషన్ కేంద్రంతోపాటు అంగన్వాడీ, ఉర్దూ మీడియం పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే,జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.