బీర్కూర్, సెప్టెంబర్ 14: దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేసిన దళితబంధు పథకం ప్రకటన దళితవర్గాల్లో ఆనందోత్సాహాన్ని నింపింది. తరతరలా వివక్ష, అణిచివేతల నుంచి విముక్తి సాధించేందుకు దళితబంధు ఒక మహత్తర కార్యక్రమంగా దళిత మేధావులు అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన పథకాలతోనే సరిపెట్టకుండా ఎస్సీల కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నూతన పథకాలను ప్రవేశపెట్టింది. అన్నింటినీ మించి దళితుల అభ్యున్నతిని కళ్లారా చూడాలన్న సంకల్పంతో ఉన్న పథకమే దళిత బంధు పథకం. లక్షల మంది విద్యార్థుల చదువుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు, రాజీవ్ విద్యా దీవెన పథకం, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రెండు విడుతల్లో 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేందుకు బెస్ట్ అవైలెబుల్ పథకం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పథకం, కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది. అదేవిధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి రెండున్నర లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. అన్నివర్గాలతో సహా కల్యాణలక్ష్మి పథకం ద్వారా దళిత ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. దళితులు తమ బతుకులను మార్చుకునేందుకు సబ్సిడీపై ఆటోలు, కార్లు, ట్రాక్టర్లను సైతం ప్రభుత్వం అందించింది. అయినా ఇంకా కొందరు దళితుల బతుకులు అలాగే ఉన్నాయన్న ఉద్దేశంతో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కామారెడ్డి జిల్లాలో మొత్తం జనాభా 9 లక్షల 72 వేల 625 ఉండగా అందులో దళితుల జనాభా లక్షా53 వేల 302 ఉన్నది. సీఎం కేసీఆర్ చేసిన దళితబంధు పథకం ప్రకటన జిల్లాలోని దళితుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నది.
నిజాంసాగర్ ఎంపిక..
రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట్ నియోజకవర్గంలోని చారగొండ, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్నింట్లో అవకాశంతో ఆనందోత్సాహం..
దళితబంధు పథకంలో భాగంగా కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఇచ్చిన డబ్బును సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నది ప్రభుత్వం. ఎవరెవరికీ ఏ విభాగాల్లో అనుభవం ఉందో వాటిని సైతం ఇప్పిస్తుండడంతో దళిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించి దళితబంధులో ఇచ్చే డబ్బుతో వారి ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేస్తామని చెప్పారు. మందులు, ఎరువులు, విత్తన దుకాణాలు, బార్ అండ్ వైన్స్, మీ సేవ, గ్యాస్ డీలర్షిప్స్, మినీ బస్సులు, మైనింగ్ లీజులు, సివిల్ కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగ్ సర్వీస్ ఇలా సాధ్యమైన వాటిలో కొంత రిజర్వేషన్లను పెడతామని చెప్పడంతోపాటు దళితులకు అనుభవం ఉన్న పనులు చేసుకుంటాం అంటే సంతోషంగా మద్దతు అందిస్తామని ప్రకటించడంతో దళిత వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
దళితబంధు పథకంతో రూ.10లక్షలు అందజేస్తే దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. కేసీఆర్ దళితులతోపాటు అన్ని వర్గాల వారికీ న్యాయం చేస్తున్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
70 ఏండ్లలో ఎవరూ ఏమీ చేయలేదు
70 ఏండ్ల నుంచి దళితుల గురించి పట్టించుకున్న పార్టీలు, నాయకులు లేరు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఏడేండ్లలోనే దళితుల గురించి పట్టించుకున్నది. దళితులను లక్షాధికారులను చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచించడం మంచి విషయం.
నిరుపేద దళిత కుటుంబాలకు దళితబంధు పథకం అమ లు చేయడం అభినందనీయం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ సార్ సల్లంగుండాలె. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి.