ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
వీసీకి హాజరైన కలెక్టర్, జిల్లా అధికారులు
మహబూబ్నగర్, ఏప్రిల్ 6: ప్రజలు కరోనా బారిన పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో మాట్లాడారు. కొవిడ్ కార్యాచరణ, ప్రణాళిక ఏర్పాట్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పీహెచ్సీ స్థాయిలో ప్రతిరోజు 125 మందికి పరీక్షలు, 125 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 250 మందికి, జిల్లా దవాఖానలో 375మందికి పరీక్షలు చేయాలని తెలిపారు. మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు. బుధవారం ఎంపీడీవోలు, తాసిల్దార్లు, వైద్యాధికారులు, ఎస్సైలతో సమావేశం నిర్వహించాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావు మాట్లాడారు. కొవిడ్ నివారణకు ప్రభుత్వం సూచించిన సూచనలు పాటిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని తెలిపారు. జిల్లాలో కొవిడ్ పరీక్షలు, వాక్సినేషన్, చికిత్స, ట్రీట్మెంట్, కిట్ల పంపిణీ, కేర్ సెంటర్ల ఏర్పాటు, దవాఖానల్లో ఇతర ఏర్పాట్లు, 68, 69 జీవోల అమలును పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.
భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే, జాతీయ రహదారుల కింద భూ సేకరణకు సంబంధించి అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. సమస్యలపై ప్రతిరోజు తన దృష్టికి తీసుకురావాలని, ప్రతి వారం నివేదిక సమర్పించాలన్నారు. భూ సేకరణ విషయంలో ఎక్కడా సమస్యలు రావడానికి వీళ్లేదన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణకు సంబంధించి గతంలో నిర్ధారించిన అలైన్మెంట్ ప్రకారమే ప్రస్తుతం ఉంటుందన్నారు. దానికంటే మరో 10 మీటర్లు తగ్గించి ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో కే స్వర్ణలత, ఆర్డీవో పద్మశ్రీ, సర్వే ల్యాండ్ రికార్డు జిల్లా అధికారి శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరివికాసం పథకం వేగవంతం చేయండి
జిల్లాలో గిరివికాసం పథకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో మాట్లాడారు. వారం రోజుల పాటు మండలస్థాయి అధికారులు గిరివికాసం కార్యక్రమంపై దృష్టి సారించాలన్నారు. వచ్చే వారం నుంచి తనతోపాటు అదనపు కలెక్టర్, డీఆర్డీవో, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో గిరి వికాసం పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. సీఎం గిరివికాసం కార్యక్రమం అమలులో తక్కువ ప్రగతి ఉన్న మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్ శాఖ ద్వారా సహాయ సంచాలకుల స్థాయి అధికారిని నియమించాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ధరణి కార్యక్రమంలో భాగంగా మ్యానువల్లో ఎలాంటి పనులు చేయొద్దని తెలిపారు. ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, జిల్లా షెడ్యూల్డ్ తెగల సంక్షేమాధికారి శ్రీనివాస్, ఈడీ యాదయ్య, డీఆర్డీవో వెంకట్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలీస్ వాహనం బోల్తా.. ఎస్ఐకి గాయాలు
మరీ ఇంత పక్షపాతం పనికి రాదు సుకుమార్ గారు..!