శిల్పారామం పనులు త్వరగా పూర్తి చేయాలి
అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
ఐటీ పార్కుతో యువతకు ఉద్యోగావకాశాలు
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ టౌన్, మార్చి 28 : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ సమీపంలో నిర్మిస్తున్న శిల్పారామం పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ సమీపంలో చేపడుతున్న శిల్పారామం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిల్పారామంతో పాటు ట్యాంక్బండ్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని, అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలని సూచించారు. సుందర పట్టణంగా మహబూబ్నగర్ను తీర్చిదిద్దుతామని, ఇప్పటికే రోడ్ల విస్తరణ, జంక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని తెలిపారు. రోడ్డు విస్తరణతో మరింత వ్యాపార అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గతంలో తాగునీటి ఇబ్బందులు చూశాం.. మిషన్ భగీరథ వచ్చాక నీటి సమస్యకు చెక్ పడిందని తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు కానున్న ఐటీ పార్కుతో యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అందరూ కలిసిరావాలని కోరారు.
అంబలి కేంద్రం ప్రారంభం
మహబూబ్నగర్ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లిలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాతలు ముందుకొచ్చి అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారని అభినందించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, కౌన్సిలర్ రాణి, కోఆప్షన్ సభ్యురాలు వరలక్ష్మి, నాయకులు స్వదేశ్ అడ్వకేట్, రాజు, రవి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణానికి ముందు..ఈ టిప్స్ పాటించండి
విదేశాలకు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి