గద్వాల రూరల్, అక్టోబర్ 17 : ఇటీవల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే. ముల్కలపల్లి గ్రామానికి చెందిన గుర్రం నర్సింహులు 18 ఏండ్ల కిందట మహబూబ్నగర్లో గుర్రపు బండి నడుపుతూ జీవనోపాధి పొందేవాడు. ఆ తర్వాత గుర్రపు బండ్లకు ఆదరణ తగ్గడంతో పదేండ్ల కిందట సొంతూరు ముల్కలపల్లికి చేరుకున్నాడు. అతడికి ఉన్న 2 ఎకరాల్లో వరి సాగు చేయడంతోపాటు నాలుగు ఆవులను పెంచుతున్నాడు. ఈ ఆవులు ఇచ్చే 7 లీటర్ల పాలను విక్రయించి ఉపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో తన బైక్లో పెట్రోల్ పోసి నడపడం భారంగా మారింది. బైక్లో పెట్రోల్ పోయలేకపోయేవాడు. గద్వాలకు వెళ్లాలన్నా ఎవరూ లిఫ్ట్ ఇచ్చే వారు కాదు.. దీంతో బైక్ను విక్రయించి వచ్చిన డబ్బులతో ఏపీలోని కర్నూల్ జిల్లా పొద్దుటూరులో రూ.22 వేలకు గుర్రాన్ని కొనుగోలు చేశాడు. పొలం వద్దకు గుర్రంపై వెళ్తున్నాడు. సొంత పనులు ఏమైనా ఉంటే గద్వాల జిల్లా కేంద్రానికి సైతం గుర్రాన్నే ఆశ్రయిస్తున్నాడు. ఒక్కరోజు సుమారు 50 కిలోమీటర్లు గుర్రం మీదనే ప్రయాణం చేస్తున్నాడు. చిన్ననాటి నుంచి గుర్రంపై స్వారీ చేయాలనే కోరిక ఉండేదని నర్సింహులు వివరించాడు. సినిమాల్లో, టీవీల్లో గుర్రాలను చూసి ఎంతో సంతోషపడేవాడినని పేర్కొంటున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం గుర్రానికి నిత్యం ఉలవలు, కొర్ర దాణా, తవుడు, కందిపొట్టు, గానిగ చెక్క నిత్యం కిలో చొప్పున మేతగా వేస్తున్నాడు. ఇందుకోసం నెలకు రూ.1500 వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు. అదే బైక్పై తిరగాలంటే పెట్రోల్కు నెలకు రూ.3 వేలు ఖర్చు అయ్యేదని, అందుకే గుర్రాలను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇటీవల రూ.30 వేలతో మరో గుర్రాన్ని కొనుగోలు చేసినట్లు నర్సింహులు చెప్పాడు.