గద్వాల,అక్టోబర్01: గత పాలకుల నిర్లక్ష్యంతో నడిగడ్డ ఉన్నత విద్యవైపు అడుగులు వేయలేక పోయింది. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఉన్నతవిద్యపై దృష్టిపెట్టి ఈ ప్రాంత విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్తో మాట్లాడి గద్వాల జిల్లాకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించారు. కళాశాల అనుమతితో ఇక్కడి పేద విద్యార్థులకు చేయూతనిచ్చినట్లయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో వెనుకబడిన నడిగడ్డకు కలిసొచ్చింది. గతంలో గ్రూప్స్ కోచింగ్కు వెళ్లాలంటే ఈ ప్రాంత విద్యార్థులకు వేలకువేలు ఖర్చు అయ్యేది. అయితే ప్రభుత్వం నడిగడ్డలో ఎమ్మెల్యే కోరిక మేరకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేశారు. దీనికి తోడు గద్వాలలో పీజీ కళాశాలకు ఎంబీఏ కోర్సు మంజూరు కావడంతో ఇక్కడి విద్యార్థులు ఎక్కడికీ వెళ్లకుండా ఉన్న చోటే ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఐఐఐటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను నిపుణుల కమిటీ పరిశీలించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా కళాశాల పనులు
జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు కావడంతో అందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కళాశాలకు అవసరమైనా ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. త్వరలో భవన నిర్మాణం చేపట్టడానికి అధికారులు కృషి చేస్తున్నారు. నూతన భవన నిర్మాణ పనులు పూర్తయ్యేలోగా తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన భవనాన్ని గంజిపేటలో అద్దెకు తీసుకున్నారు. ఆ భవనంలోనే కళాశాల నిర్వాహణకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశారు. కళాశాలకు అనుబంధంగా వసతిగృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.
100 సీట్లు కేటాయింపు
జిల్లాలో 2021-22విద్యాసంవత్సరంలో ప్రారంభం కానున్న నర్సింగ్ కోర్సు చదివేందుకు ప్రభుత్వం 100సీట్లు కేటాయించింది. ఇంటర్లో బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు నర్సింగ్ కోర్సు చదివేందుకు అర్హులుగా ప్రకటించింది. ఈ నెల చివరి వరకు కళాశాల తరగుతులు ప్రారంభించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే డిప్యూటేషన్పై 10మంది ఆధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిని నియమించింది. ఈ ఏడాది ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా విద్యార్థులను మెరిట్ ఆధారంగా కోర్సు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు నాలుగేండ్లపాటు నాణ్యమైన బోధనతోపాటు బీఎస్సీ నర్సింగ్ విధివిధానాలపై ప్రభుత్వ జిల్లా దవాఖానలో శిక్షణ అందించనున్నారు. నర్సింగ్ కళాశాలలో సీటుపొందిన విద్యార్థినులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.5వేల స్కాలర్షిప్ అందించనున్నది. మొదటి ఏడాది 100మంది విద్యార్థినులకు అవకాశం కల్పించింది.