ప్రారంభమైన లక్ష్మీనృసింహుడి జాతర
పెద్ద రథంపై స్వామి వారి ఊరేగింపు
భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలు
రేగొండ, మార్చి 28 : మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామి వారికి అభిషేకం, అర్చన, మధ్యాహ్నం పూర్ణాహుతి, హోమబలి హరణం గావించారు. రాత్రి పెద్దరథంపై స్వామి వారిని ఊరేగించారు. అనంతరం బోనాలు, బండ్లు తిరుగడంతో జాతర ప్రారంభమైంది. పెద్ద రథంపై స్వామి వారిని ఊరేగిస్తున్న సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కోలాటాలు, డప్పుచప్పుళ్లు, భక్తుల కరతాళ ధ్వనులతో స్వామి వారి రథయాత్ర కనులపండువగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్వామి వారి రథం లాగారు. ఆలయ ఆర్చకులు, చైర్మన్ మహేందర్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్రావు, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయాముత్యంరావు, సర్పంచ్ పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ రవీందర్రావు, సర్పంచ్లు కుసుంబ రంజిత్, నడిపెల్లి శ్రీనివాసరావు ఉన్నారు.
ఏర్పాట్లు చేసిన అధికారులు
జాతర సందర్భంగా భక్తుల కు మంచినీటి వసతులతోపాటు మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు, వైద్య, విద్యుత్తో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. ఉత్సవాలను ఆలయ చైర్మన్ ఇంగె మహేందర్, ఈవో బిళ్ల శ్రీనివాస్, ధర్మకర్తలు గైని కుమారస్వామి, మాదాటి అనిత, గండి తిరుపతి, మాదాటి కర్ణాకర్రెడ్డి, పోగు సుమన్, సమ్మయ్య పర్యవేక్షించారు. ఎస్సై కృష్ణప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.