రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం
నగరంలో 100కు పైగా సెంటర్ల ఏర్పాటు
జోరుగా కొనసాగుతున్న అమ్మకాలు
కరీమాబాద్, ఏప్రిల్ 16: రంజాన్ మాసం మొదలైందంటే చాలు హరీస్, హలీం వంటకాలకు భలే గిరాకీ ఉంటుంది. ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరూ వీటిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఏటా ప్రత్యేకంగా రంజాన్ మాసంలోనే వీటిని తయారుచేస్తారు. దీంతో హరీస్, హలీంలకు చాలా గిరాకీ ఉంటుంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, మసీదుల వద్ద ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ నిర్వాహకులు కూడా డిమాండ్కు అనుగుణంగా వీటిని తయారు చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ హరీస్, హలీంలను ఎంతో ఇష్టంగా తింటారు. ఇఫ్తార్ విందుల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. అలాగే, ముస్లింలు వారి వారి బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా హరీస్ను అందిస్తుంటారు. కాగా, ప్రతి రంజాన్ మాసంలో నగరంలో రద్దీగా ఉండే సెంటర్లలో, రోడ్డు పక్కన డేరాలను ఏర్పాటు చేసి, హరీస్, హలీంలను తయారు చేస్తుంటారు. ఏటా వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. సాయంత్రం అయిందంటే చాలు హరీస్ సెంటర్లు జనాలతో కిక్కిరిసి పోతుంటాయి.
రంజాన్ ప్రత్యేకం..
కేవలం రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం నాటి నుంచి మాత్రమే హరీస్ సెంటర్లు వెలుస్తాయి. పలు రకాల మాంసాహారాలతో వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. పలువురు నిష్ణాతులైన మాస్టర్లను తీసుకొచ్చి మరీ వీటిని తయారు చేయిస్తుంటారు. వంటకం తయారీ కోసం 3 నుంచి 4 గంటల సమయం వరకు పడుతుంది. కాగా, హరీస్ను తయారు చేస్తూ చాలా కుటుంబాలు ఉపాధిని పొందుతున్నాయి.
రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు
రంజాన్ మాసంలో హరీస్ సెంటర్లు నగరంలో సుమారు 100 వరకు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారుల కూడళ్లలో ఇవి కనిపిస్తున్నాయి. ఉదయం రద్దీగా ఉండే పలు హోటళ్లలో సాయంత్రం హరీస్లను తయారు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీటి వ్యాపారం జోరుగా సాగుతుండడంతో చాలామంది దీనిపై మక్కువ చూపి, హరీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బీజేపీ నేతలవల్లే బెంగాల్లో కరోనా ఉధృతం..!
టీఆర్ఎస్లో పలువురు యువకుల చేరిక