వాడవాడలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
పది డివిజన్లకొక ట్రాక్టర్ కేటాయింపు
కార్పొరేషన్, ఏప్రిల్ 21: నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కట్టడికి బల్దియా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నగరంలో మొదటి విడుతలో కరోనా నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో భరోసా కల్పించారు. అదే తీరులో సెకండ్ వేవ్ను కూడా నియంత్రించడంతో పాటు నగరవాసుల్లో మనోధైర్యం నింపి, భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని 60 డివిజన్ల పరిధిలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. 10 డివిజన్లకొక ట్రాక్టర్ను అద్దె ప్రాతిపదికన తీసుకొని వీధుల్లో, ప్రధాన రహదారుల వెంట సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. అలాగే, పారిశుధ్య కార్మికులతో ఇండ్లల్లో, వ్యాపార, వాణిజ్య సముదాయాల ఎదుట సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటితో పాటు చుట్టూ పక్కల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, రసాయనాలు పిచికారీ చేయిస్తున్నారు. డివిజన్ల వారీగా పాజిటివ్ వచ్చిన వారి వివరాలను సేకరిస్తూ ఎప్పటికప్పుడు ఆయా ఏరియాల్లో వైరస్ విస్తరించకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
డివిజన్ల వారీగా అవగాహన
నగరంలోని 60 డివిజన్లలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్పొరేటర్లు, అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. పోస్టర్లు, ఆటోల్లో మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మాస్క్ ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కాలనీల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.